CM Revanth Reddy on Government Schools : గురుకులాల్లో డే స్కాలర్ విద్య అందించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెంచాలన్న సీఎం, అందుకు స్థలాలు గుర్తించాలని విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. అద్దె చెల్లించలేదంటూ గురుకులాల భవనాలకు యజమానులు తాళాలు వేస్తున్న విషయం తనకెందుకు చెప్పలేదని అధికారులను రేవంత్ ప్రశ్నించినట్లు సమాచారం. సమీక్షకు కొందరు సరిగా సన్నద్ధమై రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
నాణ్యమైన భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండటంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. అలాంటిచోట్ల మౌలిక వసతులను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు చుట్టుపక్కల నుంచి వచ్చి చదువుకొని ఇళ్లకి వెళ్లేలా డే స్కాలర్లకు అవకాశం ఇవ్వడంపై అధ్యయనం చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన ఆయన, కోరుకున్న విద్యార్థులందరికీ గురుకులాల్లో సీట్లు ఇవ్వలేమని, అయితే డే స్కాలర్లకు సైతం గురుకులాల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించవచ్చని తెలిపారు. ఆ తర్వాత వారు ఇళ్లకు వెళ్లి కుటుంబంతో గడపవచ్చన్న సీఎం ఆ విషయాన్ని పరిశీలించాలని సూచించారు.
కొత్త స్కూల్స్ ఓపెన్ చేయండి : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల కింద ఇంటర్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబద్ధీకరించి, ప్రతి పాఠశాలలో నిర్ధిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న చోట కొత్తగా ఈ ఏడాది నుంచే 571 ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్నందున పురపాలక శాఖతో సమన్వయం చేసుకొని, కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన, వదిలిపెట్టిన స్థలాల్లో వాటిని ప్రారంభించాలని సూచించారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తే ప్రయోజనం ఉంటుందని రేవంత్రెడ్డి తెలిపారు. మనిషి జీవితంలో కుటుంబం, సమాజం ప్రాధాన్యం, బాధ్యతను పిల్లలకు తెలిసేలా కౌన్సెలింగ్ ఇప్పిస్తే, వారు బాధ్యతాయుత పౌరులుగా మారతారని అభిప్రాయపడ్డారు.
ఆ విషయం నాకెందుకు చెప్పలేదు : అద్దె చెల్లించలేదంటూ గురుకులాల భవనాలకు యజమానులు తాళాలు వేస్తున్న విషయం తనకెందుకు చెప్పలేదని అధికారులను సీఎం రేవంత్ ప్రశ్నించినట్లు సమాచారం. సమీక్షకు కొందరు సరిగా సన్నద్ధమై రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ భవనాల ఆకృతుల నమూనాలను విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీ గణపతిరెడ్డి చూపించగా, సీఎం రేవంత్రెడ్డి కొన్ని మార్పులు సూచించినట్లు సమాచారం.
విద్యా హక్కు చట్టంలోని 12(1)(సి) సెక్షన్ అమలు చేస్తామని, ఆ ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించేలా చూడటం సహా ఫీజులు చెల్లిస్తామని ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ఆ విషయంపై సీఎం సమీక్షలో చర్చించినట్లు సమాచారం. కర్ణాటక తరహాలో ప్రభుత్వ పాఠశాలలు లేనిచోట్ల మాత్రమే విద్యార్థులకు ప్రైవేట్లో చదువుకునే అవకాశం ఇవ్వడంపై ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తే సమస్యే ఉండదని భావించి 571 పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు భావిస్తున్నారు.
"ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యా సంస్థలను హేతుబద్ధీకరించి ప్రతి పాఠశాలలో కావాల్సిన సంఖ్యలో విద్యార్థులు చదివేలా చూడాలి. యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నాణ్యమైన భోజనం ఇస్తున్నందున విద్యార్థులు పెద్ద సంఖ్యలో గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారు. డే స్కాలర్లకు కూడా ఈ సౌకర్యాలను అందించే విషయంపై అధ్యయనం చేయాలి" -ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు - ఎవరెవరికి ఏ శాఖ కేటాయించారంటే?
రాహుల్గాంధీ, ఖర్గేలతో సీఎం రేవంత్ సమావేశం - హైకమాండ్ ఆదేశం మేరకు దిల్లీకి ఉత్తమ్