CM Revanth Reddy Review on Miss World 2025 Arrangements : ప్రపంచ సుందరి పోటీలకు సర్వం సిద్ధమవుతోంది. మొట్టమొదటి సారిగా మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. మిస్ వరల్డ్-2025 పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మే 10న హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లను అధికారులు సీఎంకు వివరించారు. పోటీల్లో పాల్గొనేందుకు సుమారు 140 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం తెలిపారు. ఎయిర్ పోర్టు, హోటళ్లు, ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు విభాగాలవారీగా ప్రత్యేక అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్లో పెండింగ్లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మిస్ వరల్డ్-2025 ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఏర్పాట్లు, కార్యక్రమాలపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్, డీజీపీ జితేందర్, పోలీస్ కమిషనర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

'ఆ లక్ష్యంతోనే రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు - రాజకీయ కోణంలో చూడటం సరికాదు'
హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు - అట్టహాసంగా జరగనున్న వేడుకలు