CM Revanth Reddy Reviews Irrigation Department : కృష్ణానదిపై అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు, ఉద్దండాపూర్ వరకు తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు. కృష్ణాజలాల్లో న్యాయబద్ధమైన వాటా కోసం ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయడం సహా రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్లోని జలసౌధలో నీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో కలిసి నదీజలాలు, అంతర్రాష్ట్ర అంశాలు, ప్రాధాన్యతా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు.
తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టు పనులు వేగంగా చేపట్టాలని సీఎం సూచించారు. కృష్ణా బేసిన్లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థికశాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. భూసేకరణ వేగంగా పూర్తయ్యేందుకు రెవెన్యూ విభాగంతో సమన్వయం చేసుకొని పనులు వేగవంతం చేయాలని చెప్పారు. భూసేకరణ పూర్తి చేయకుండా పనులు చేయవద్దని సీఎం తెలిపారు. కొద్దిపాటి పెండింగ్లో ఉండటంతో మిగతావి చేసినా ఫలితం ఉండట్లేదని తెలిపారు. గతంలో మాదిరిగా నాలుగు పైపులు తెచ్చి, పని చేశామని చెబితే కుదరదని స్పష్టం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సమీక్ష : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దండాపూర్ వరకు తొలి ప్రాధాన్యంగా పూర్తిచేయాలని అధికారులని సీఎం ఆదేశించారు. ఉద్దండాపూర్ వరకు పెండింగ్లో ఉన్న పనులు 18 నెలల్లో పూర్తయ్యేలా కార్యాచరణ ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల ప్రాజెక్టులను ఈ ఏడాది డిసెంబర్ లోపు, కోయిల్సాగర్ ఎత్తిపోతలను వచ్చే జూన్లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
దేవాదుల, గౌరవెల్లి ప్రాజెక్టులపై సమీక్ష : దేవాదుల, గౌరవెల్లిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. మూడు నెలల్లో గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేసి, పనులు వేగవంతం చేయాలని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, దేవాదుల పనులను ప్రాధాన్యంగా తీసుకోవాలని తెలిపారు. నిజామాబాద్లోని 20, 21, సంగారెడ్డి జిల్లా 27వ ప్యాకేజీపై ఆయన సమీక్షించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఎస్ఎల్బీసీపై సమీక్ష : SLBC సొరంగం అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. డేంజర్ జోన్లో సహాయక చర్యలు, తదుపరి పనులకు సంబంధించి నిపుణుల కమిటీ సూచనలు, సలహాల మేరకు ముందుకెళ్లాలని ఇంజినీర్లకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణకు : కృష్ణాజలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాల సాధనకు చేస్తున్న ప్రయత్నాలను ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలని నిర్దేశించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం సుమారు 70 శాతం తెలంగాణలో ఉంటే, కేవలం 30 శాతం మాత్రమే ఏపీలో ఉందని, కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని చెప్పారు.
గోదావరి బేసిన్ నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ తీసుకుంటున్న 90 టీఎంసీలను ఎగువన వాడుకునేలా నీటి కోటా పెంచుకునేలా కృష్ణా యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేటాయించిన నిర్ణీత నీటివాటాల విషయంలో ప్రభుత్వ వాదనలు సమర్థంగా ఉండాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టినప్పుడు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నీటి వాటాల అనుమతులు తీసుకోవాలని సూచించారు.
కేసు పెట్టి లోపల వేయిస్తా! : కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. తప్పు చేసిన ఇంజినీర్లు, అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పొరపాట్లు లేకపోతే ఇబ్బంది ఉండబోదని అన్నట్లు సమాచారం. గతంలో పని చేసినట్లు చేస్తే కుదరదని కొందరు ఇంజినీర్లను హెచ్చరించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ సీఈ రమణారెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు కాళేశ్వరంలో ఎస్ఈగా పని చేసిన ఆయనకు నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలు పూర్తయి, పంప్హౌస్ల పనులు ప్రారంభమైన తర్వాతే పైపులకు సంబంధించిన బిల్లులు పెట్టాలని సూచించారు. ఈ క్రమంలోనే అక్కడ చేసినట్లు (కాళేశ్వరంలో ఎస్ఈగా చేసిన సమయంలో చేసినట్లు) ఇక్కడ కూడా చేస్తే కేసు పెట్టి లోపల వేయిస్తా అని సీఎం హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాజెక్టుల వారీగా పనుల కోసం నిధులు ఇవ్వాలని నీటి పారుదల శాఖ కోరగా, అధికారుల స్థాయిలో సమావేశమై సమీక్షిస్తామని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై మరోసారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.