CM Revanth Reddy Meets with JICA : మెట్రో రైలు రెండో దశ నిర్మాణం కోసం రూ.11,693 కోట్ల రుణం ఇవ్వాలని జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జైకా)ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. సుమారు రూ.24,269 కోట్లతో చేపట్టనున్న మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ తుది పరిశీలనలో ఉన్నాయని జైకా బృందానికి సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనుల కోసం ఆర్థిక సాయం కోసం టోక్యోలో జైకా ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది.
మెట్రో రైలు రెండో దశతో పాటు మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డును అనుసంధానించే రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం ఇవ్వాలని జైకాను సీఎం కోరారు. పెట్టుబడిదారులను ఆకర్షించేలా హైదరాబాద్ను అత్యంత ఆకర్షణీయమైన నగరంగా అభివృద్ధి చేసేందుకు పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివరించారు. భారత ప్రభుత్వ విదేశీ రుణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుందని సీఎం చెప్పారు.

హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచ నగరాలకు దీటుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు జైకా ప్రతినిధులతో సీఎం చెప్పారు. జైకాకు, తెలంగాణతో కొన్నేళ్లుగా సంబంధాలున్నాయని జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ షోహెయ్ హరా అన్నారు. మెట్రో రైలు విస్తరణతో పాటు, అర్హతలున్న ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సీఎంకు ఆయన సూచించారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అత్యాధునిక ఫిలిం సిటీ ఏర్పాటు : రాష్ట్రంలో అత్యాధునిక ఫిలిం సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు రేవంత్రెడ్డి తెలిపారు. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి బృందం టోక్యోలోని సోని ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిందిం. సోని యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ ప్రతినిధులతో చర్చించారు. తెలంగాణలో ఎండ్ టూ ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యంతో అత్యాధునిక ఫిలింసిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులతో సీఎం చర్చించారు. హైదరాబాద్లో యానిమేషన్, వీఎఫ్ఐ, గేమింగ్ రంగాల్లో అనేక అవకాశాలు, అనుకూలతలు ఉన్నాయని వారికి చెప్పారు. సోని ఉత్పత్తులు, భవిష్యత్తు ప్రణాళికలను రాష్ట్ర బృందానికి ఆ కంపెనీ ప్రతినిధులు వివరించారు.
తొలి రోజే రూ.1000 కోట్ల ఒప్పందం - తెలంగాణలో పెట్టుబడులకు జపాన్ కంపెనీ ఓకే!
నేటి నుంచి సీఎం రేవంత్ జపాన్ టూర్ - సోనీ, టయోటా, తోషిబా కంపెనీల సీఈవోలతో భేటీ