CM Chandrababu Thanks to Public : ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చంద్రబాబు అన్నారు. ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం, అపురూప అవకాశమన్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరి అభిమానం, ఆప్యాయతతో తన మనసు ఉప్పొంగిందని పేర్కొన్నారు. 75 ఏళ్ల తన జీవన ప్రయాణంలో 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తోడునీడగా ఉండి, ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
నిరంతరం కష్టపడి పనిచేస్తా : అందరీ ఆదరాభిమానాలు, నమ్మకం తనలో బాధ్యతను, నిబద్ధతను మరింత పెంచాయన్నారు. ప్రజల భవిష్యత్ కలలు, ఆకాంక్షల సాకారానికి నిరంతరం కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఏపీ రాష్ట్రాభివృద్ధికి, తెలుగు ప్రజల అభ్యున్నతికి పునరంకితం అవుతానన్నారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ను ప్రజల మద్దతు, సహకారం, సమిష్టి కృషితో ఆ కలను నిజం చేస్తానన్నారు. సమాజంలో అసమానతలు పోవాలని పేద-ధనిక వర్గాల మధ్య అంతరాలు తగ్గాలని సీఎం వివరించారు.
ప్రతి పౌరుడి భవిష్యత్తుకు భరోసా : పేదరికం లేని సమాజం స్థాపించాలనేదే తన సంకల్పమని అందుకే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి సంపన్న వ్యక్తి పేదవాడి శ్రేయస్సు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తెలుగు జాతిని నిలపాలన్నదే తన అభిలాష అన్నారు. అందరికీ అవకాశాలు కల్పించేలా, ప్రతి పౌరుడి భవిష్యత్తుకు భరోసా నిచ్చేలా పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.
భవిష్యత్తులో తిరుగులేని విజయాలు : ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ ఆవిష్కరణలకు, అవకాశాలకు కేంద్రంగా మలచాలనేది తన తపన అని, ‘థింక్ గ్లోబల్లీ-యాక్ట్ గ్లోబల్లీ’ విధానంతో రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం తెలుగు ప్రజల రక్తంలోనే ఉందన్నారు. దేశభక్తి చాటేలా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు చేయిచేయి కలుపుదామని తనతోపాటు, అందరూ ఇందులో భాగస్వాములు అయ్యేలా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో మనమంతా తిరుగులేని విజయాలు సాధించాలన్నారు.
'అనితర సాధ్యుడు - నా మిత్రుడు చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు'
సీఎం చంద్రబాబు 75వ జన్మదినోత్సవం - 75 కేజీల కేక్లతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు