CM CHANDRABABU ON MEDICAL AND HEALTH: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల నుంచి 300 పడకల సామర్ధ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 100 పడకలకు పైగా సామర్ధ్యం ఉన్న ఆస్పత్రులు ఇప్పటికే 70 వరకు ఉన్నాయని, మిగిలిన 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ నిర్మాణం జరిగేలా త్వరితిగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో: పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి, నిర్వహించేలా ఆలోచన చేయాలని, ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చే విధానం రూపొందించాలని చెప్పారు. సచివాలయంలో ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో వైద్యసేవల్ని మరింత విస్తృత పరచాలని చెప్పారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచ దేశాలన్నీ వైద్యం కోసం అమరావతి వచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని చెప్పారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు చెప్పారు.
పీహెచ్సీ, సీహెచ్సీ స్థాయిలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో రోగులకు వర్చువల్ విధానంలో ప్రాథమిక సేవలు అందేలా చూడాలన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రక్రియపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. రూ.32.5 కోట్లతో 25 డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్లను బలోపేతం చేయడంతో పాటు, కొత్తగా మరో 13 డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఏజెన్సీ ఏరియాలోని పీహెచ్సీల్లో వైద్య ఖాళీల భర్తీ, విజయనగరంలో కొత్తగా 8 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, ఎన్టీఆర్, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో డయాలసిస్ మెషిన్లు పెంచడం, కొవ్వూరు-నిడదవోలు సీహెచ్సీలను అప్గ్రేడ్ చేయడం తదితర అంశాలపైన మార్గదర్శకాలు జారీ చేశారు.
కుప్పంలో అమలు చేస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అభివృద్ధి చేసిన వినూత్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం డిజిటల్ నెర్వ్ సెంటర్ పురోగతి గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి ఆరోగ్య సంరక్షణ అందించడానికి డిజిటల్ నెర్వ్ సెంటర్ దోహదపడుతుందన్నారు దేశంలోనే అత్యధికంగా 4.47 కోట్ల (88 శాతం) మందికి రాష్ట్రంలో అభా కార్డులు జారీ అయ్యాయనీ అధికారులు తెలిపారు.
'ఏఐలో ప్రపంచాన్ని అధిగమిస్తున్న భారత్'- ఓపెన్ఏఐ సీఈవోను ఏపీకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
ఏపీలో విస్తరించనున్న లారెస్ ల్యాబ్స్ - రూ.5,000 కోట్లతో పెట్టుబడులు