మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ : సీఎం చంద్రబాబు
విశాఖలో అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 16, 2025 at 11:38 PM IST
CM Chandrababu on Yoga Day : రికార్డు సృష్టించేలా విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డే నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలని చెప్పారు. జూన్ 21న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం నిర్వహణపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులో కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. నెల రోజుల పాటు యోగా ప్రాక్టీస్ చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పారు. విశాఖలో లక్షల మందితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ యోగాసనాలు వేస్తారని తెలిపారు. ఆర్కే బీచ్ నుంచి సముద్రతీరం పొడవునా లక్షల మందితో యోగా డే నిర్వహించనున్నట్లు వివరించారు. యోగా డే అనంతరం కూడా ఏపీలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలని చంద్రబాబు వెల్లడించారు.

