CM Chandrababu Review on Govt Schemes and Services: ప్రభుత్వ పథకాలు, పౌరసేవలపై జూన్ 12 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, సేవల అమలుపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి వారం నాలుగు శాఖల పరిధిలో పథకాలు, సేవలపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ను సమీక్షిస్తున్న సీఎం రేషన్, దీపం-2, ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీ సేవలపై ప్రజాభిప్రాయాలను పరిశీలించారు. ఈ శాఖల పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్, క్యూర్ కోడ్ వంటి విధానాల ద్వారా అభిప్రాయాలు తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ అభిప్రాయాలపై సీఎస్, సీఎంవో, సెక్రటరీలతో సీఎం చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుందని అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు ప్రజా సేవల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి కనిపించాలని సీఎం తేల్చి చెప్పారు.
జూన్ 12 తర్వాత ఆకస్మిక తనిఖీలు: సంక్షేమ పథకాల అమలు, పౌరసేవలు అందిస్తున్న తీరుపై జూన్ 12 తర్వాత ఆకస్మిక తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని అయితే ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందన్నారు. దీపం- 2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగానే ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. దీపం పథకం లబ్ధిదారుల నుంచి ఏజెన్సీ వాళ్లు కానీ, ఇతర స్థాయిల్లో కానీ ఎక్కడా డబ్బులు అదనంగా వసూలు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు.
ప్రథమ స్థానంలో పశ్చిమ గోదావరి: రేషన్ సరుకుల నాణ్యతపై అడిగిన అభిప్రాయానికి 76 శాతం మంది బాగుందని సర్వేలో వెల్లడైంది. రేషన్ పంపిణీ, నాణ్యతపై ప్రజల సంతృప్తిలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. గ్యాస్ డెలివరీ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్న అంశంపై వేసిన ప్రశ్నలకు 62 శాతం మంది నుంచి లేదని సమాధానం వచ్చింది. ఈ విషయంలో లబ్ధిదారుల ఖాతాల్లో ముందుగానే డబ్బులు వేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీ సేవల విషయంలో ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో సంతృప్తి వ్యక్తం కాలేదని ఈ విషయంలో అధికారులు మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు.
బస్టాండ్లలో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ విషయంలో ప్రయాణికుల నుంచి అసంతృప్తి వస్తోందని దీన్ని సరిచేసుకోవాలని తెలిపారు. పంచాయతీ సేవల విషయంలో ఇంటి నంచి చెత్త సేకరణ జరుగుతుందా అనే ప్రశ్నకు 60 శాతం మంది అవుననే చెప్పారని వివరించారు. గతంతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ మెరుగైందని సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలకు తడి చెత్త నిర్వహణ బాధ్యత అప్పగించి కంపోస్ట్ తయారీ చేపడతామన్నారు.
మన మిత్ర ద్వారా వాట్సప్ సేవలు: ప్రభుత్వ సేవల విషయంలో డేటా అనలిటిక్స్ కీలకమని సీఎం చెప్పారు. డేటా ఆధారంగా ఆయా ప్రభుత్వ శాఖల పనితీరును క్షేత్రస్థాయి నుంచి పరిశీలించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను సమర్థవంతంగా విశ్లేషిస్తే ప్రభుత్వ సేవల్లో అనూహ్య మార్పులు తేవచ్చన్నారు. మరోవైపు వాట్సప్ గవర్నెన్సు ద్వారా 325 సేవలు అందుతున్నాయని జూన్ 12 నాటికి 500 సేవలు అందించాలని సీఎం సూచించారు. మన మిత్ర ద్వారా వాట్సప్ సేవలు అందుబాటులోకి వచ్చాక ఇప్పటి వరకూ 45 లక్షల మంది సేవల్ని వినియోగించుకున్నట్టు తెలిపారు. ఓర్వకల్లులోని ఇండస్ట్రియల్ నోడ్లో ఏర్పాటు చేయనున్న డ్రోన్ సిటీ టెండర్ల ప్రక్రియ జూన్ 12 తేదీకి పూర్తి కానుందని అధికారులు సీఎంకు వివరించారు.
2047 నాటికి ప్రపంచంలో టాప్ 2 నగరాల్లో హైదరాబాద్, అమరావతి: చంద్రబాబు
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు: సీఎం చంద్రబాబు