CM Chandrababu on Medical Health : వైద్యం, ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై ఆయన వివరించారు. అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ 100 నుంచి 300 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.
చాలా ఆసుపత్రుల నుంచే వ్యాధులు ఇతర రోగులకు వ్యాపిస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి చెక్ పెట్టేలా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. గుండె జబ్బులు, డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు కొన్నిచోట్ల విస్తృతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్ టెన్షన్ కనిపిస్తోందని వెల్లడించారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉందని సీఎం వివరించారు.
"చాలా వ్యాధుల నివారణ కోసం నియంత్రిత ఆహారపు అలవాట్లు పాటించాల్సిందే. నలుగురు సభ్యులు కలిగిన సాధారణ కుటుంబం రోజుకు 4 గ్రాముల ఉప్పు చొప్పున నెలకు 600 గ్రాములనే వాడాలి. వంటనూనె కూడా రోజుకు 15 గ్రాములు చొప్పున నెలకు 2 లీటర్ల మాత్రమే వినియోగించాలి. రోజుకు 25 గ్రాముల చొప్పున చక్కెర కూడా నెలకు 3 కేజీల వాడితే సరిపోతుంది. ఇది సమతుల్యమైన డైట్గా గుర్తించి నియంత్రణ చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వివిధ దేశాల్లో విజయవంతమైన అధ్యయనాలు ఇవి." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
'ఉప్పు, వంటనూనె, చక్కెర తగ్గిస్తే చాలా వరకూ అనారోగ్య సమస్యలు దరి చేరే అవకాశం ఉండదు. కనీసం ఒక్క అరగంట పాటు తేలిక పాటి వ్యాయామం చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రాణాయామం చేయాలని కూడా పిలుపు ఇస్తున్నా. ప్రపంచం అంతా ఇప్పుడు ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తోంది. ఇటీవలే న్యూట్రిఫుల్ అనే యాప్ తయారు చేశాం. దానికి స్కోచ్ అవార్డు కూడా వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన యాప్ ఇది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు డబ్బులు ఏమి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ యాప్ను ఇప్పటి వరకూ 4 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు' అని చంద్రబాబు వెల్లడించారు.
"ఆహారం ఔషదం, వంటగదే ఔషధశాల అనే సూత్రాన్ని నేను బలంగా నమ్ముతాను. అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. తద్వారా ప్రభుత్వాలు హెల్త్పై చేసే వ్యయం తగ్గుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందన్నది వాస్తవం. త్వరలోనే ఏపీ వ్యాప్తంగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తాం. ప్రస్తుతం పైలట్గా కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ను ఏర్పాటు చేశాం. త్వరలో చిత్తూరు జిల్లాలో చేయబోతున్నాం. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తాం. అదేవిధంగా త్వరలో పిల్లల హెల్త్ రికార్డులను కూడా డిజిటల్ లాకర్లో పెడతాం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
Chandrababu on Digital Nerve Centre : ఏపీలో అందరికీ ఆభా (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) ఐడీ కార్డులు జారీ చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. రియల్ టైంలోనే ప్రజల ఆరోగ్యం పర్యవేక్షించాలని భావిస్తున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ వ్యాన్ ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు చేస్తుందని తెలిపారు. మొత్తం 27 పరీక్షలు దీని ద్వారా నిర్వహించేందుకు ఇప్పటికే కార్యాచరణ చేశామన్నారు. ఈ వ్యవస్థల రూపకల్పనకు టాటా సంస్థతో పాటు, బిల్గేట్స్ ఫౌండేషన్, ఏపీ మెడ్టెక్ పార్క్ సహకరిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
'ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అవసరమైతే వయబిలిటి గ్యాప్ ఫండింగ్ కూడా ఇస్తాం. రాష్ట్రంలో ప్రభావితం చేస్తున్న 10 ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక అధికారులను నియమిస్తాం. ఇప్పటికే క్యాన్సర్కు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును నియమించాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రపదేశ్ తమ ప్రభుత్వ లక్ష్యం. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తున్నాం. కేంద్రం దేశ వ్యాప్తంగా 25 గ్లోబల్ మెడిసిటీలను పీపీపీ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. మొత్తం 100 ఎకరాల్లో దీనిని నిర్మిస్తాం' అని చంద్రబాబు అన్నారు.
మరోవైపు ఏపీ ఆర్థిక అభివృద్ధి అంచనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. వృద్ధి రేటు సాధనలో కృషి చేసిన పీయూష్ కుమార్ సహా ప్రణాళికా విభాగం అధికారులను సీఎం అభినందించారు. వారికి అరకు కాఫీ ఇచ్చి సత్కరించారు. 2025- 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.3,11,004 లక్షల తలసరి ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. వ్యవసాయం 16.47 శాతం,పరిశ్రమలు 17.32, సేవల రంగం 16 శాతం మేర పెరుగనున్నట్లు చెప్పారు. మొత్తంగా రూ.18.35 లక్షల కోట్ల జీఎస్డీపీ నమోదవుతుందని సీఎం అంచనా వేశారు.
నా జీవితం ప్రజలకే అంకితం : సీఎం చంద్రబాబు
జీరో పావర్టీ సాధించగలిగితే నా జన్మ చరితార్థం: సీఎం చంద్రబాబు