Chandrababu on Port Economy : సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబాబు అన్నారు. ఏపీలో 1000 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మారిటైం ప్రాజెక్టులు నెలకొల్పుతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు, పోర్టులపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ సెక్రటరీ టీకే రామచంద్రన్, మంత్రి బీసీ జనార్దన్రెడ్డితో పాటు పలువురు కేంద్ర రాష్ట్ర అధికారులతో చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోర్టులు, కొత్తగా నిర్మితవుతున్న పోర్టుల స్థితిగతులపై చర్చించారు. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే ఆలోచనతో తాము ఉన్నామని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలిపారు.
రాష్ట్ర విభజన సమయంలో నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నంలో పోర్ట్, ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు నాడు కేంద్రం ప్రభుత్వం అంగీకరించిందని చంద్రబాబు గుర్తుచేశారు. కొత్త జిల్లా ఏర్పాటుతో తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చిన దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు అంశంపై వారితో చర్చించారు. ఇనిషియల్ ఫీజిబులిటీ రిపోర్ట్ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2000ల ఎకరాల్లో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించారు.
Chandrababu Review on Ports : దుగరాజపట్నంలో నౌకా నిర్మాణం, మరమ్మతుల క్లస్టర్, గ్రీన్ఫీల్డ్ పోర్ట్తో కలిపి అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. నాలుగు డ్రై డాక్లు, అవుట్ ఫిటింగ్ జెట్టీలు, షిప్ లిఫ్ట్ సౌకర్యం కలిగిన నౌకా నిర్మాణ కేంద్రం ఇక్కడ వస్తుందన్నారు. షిప్ బిల్డింగ్ పరిశ్రమకు 1000 ఎకరాలు, అనుబంధ పరిశ్రమలకు మరో 1000 ఎకరాల భూమి అవసరం కానుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.3500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపడుతుందని దీంతో పాటు పరిశ్రమకు అనువైన ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. ఆ తర్వాత స్పెషల్ పర్మస్ వెహికిల్ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానించి ఇక్కడ షిప్ బిల్డింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తద్వారా దాదాపు రూ.26,000ల కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. ప్రత్యక్షంగా 5000ల మందికి, పరోక్షంగా 30,000ల మందికి ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరుతుందని సీఎం వివరించారు.
Ship Building Unit in Dugarajapatnam : ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. దీనికి అవసరమైన కార్యాచరణ వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. మరోవైపు రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ పోర్టులో మరింత చౌకగా సరుకు రవాణాకు అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర అధికారులను కోరారు. అదే విధంగా రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం ప్రాజెక్టులకు ఉన్న అవకాశాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు పోలవరం, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో రివర్ క్రూయిజ్ సర్క్యూట్స్ను అభివృద్ధి చేసే అంశంపై అధ్యయనం చేయాలని వారికి సూచించారు.
రామాయపట్నం పోర్టు నిర్మాణంలో నవ‘యుగం’- గుత్తేదారు మార్పుతో ప్రారంభమైన పనులు
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు!