CM Chandrababu Speech in TDP Formation Day Celebrations: పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురైనా తెలుగుదేశం ఎన్నడూ వెన్నుచూపలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 43 ఏళ్లుగా సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటూ ముందుకు సాగుతోందని చెప్పారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు పసుపు జెండాను ఆవిష్కరించారు. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడిన చంద్రబాబు తెలుగువారు ఉన్నంతవరకు పార్టీ ఉంటుందని ఉద్ఘాటించారు.
వాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారు: తెలుగుదేశం వారసత్వాన్ని భావితరాలకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. తెలుగువారు ఉన్నంతవరకూ టీడీపీ శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీకి మనమంతా వారసులమే కానీ పెత్తందారులం కాదన్నారు. టీడీపీని లేకుండా చేస్తామన్న వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. కార్యకర్తలు కేవలం కాగితాలు ఇస్తే పదవులు రావని, క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీకి మనమంతా వారసులమే కానీ పెత్తందారులం కాదన్నారు.
పసుపు సైన్యానికి పాదాభివందనం: పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి సీఎం చంద్రబాబు పాదాభివందనం తెలిపారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిన జెండా, తెలుగు వారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఇచ్చిన జెండా, ఆడపడుచులకు అండగా నిలిచిన జెండా అని కొనియాడారు. రైతన్నల కన్నీరు తుడిచి, వెన్నంటే ఉన్న జెండా, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చిన జెండా, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా అని ప్రశంసించారు. భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీలు తెచ్చిన జెండా మన పసుపు జెండా అని చంద్రబాబు తెలిపారు.
చెడును శిక్షించకపోతే మంచిని కాపాడలేం: ప్రతీ కులానికి న్యాయం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. రాజకీయాల్లో ఎప్పుడూ లేని సంస్కృతి గత 5 ఏళ్లలో చూశామన్నారు. ఆస్తుల విధ్వంసం జరిగినా, రాజకీయ హత్యలు చేసినా, ఆర్ధిక మూలాలు దెబ్బతీసినా కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. మంచికి మంచిగా ఉండే మనం, తప్పు చేసి తప్పించుకోవాలనుకునే వారిని మాత్రం ఉపేక్షించమని చంద్రబాబు హెచ్చరించారు. చెడును శిక్షించకపోతే మంచిని కాపాడలేమని అన్నారు.
తెలుగుదేశం పార్టీకి తిరుగేలేదు: కార్యకర్తలు హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి తిరుగేలేదని తెలిపారు. కార్యకర్తల్లో హుషారు తగ్గినప్పుడే విపక్షం పుంజుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రతీ తెలుగుదేశం కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు ఇస్తామన్నారు. ప్రజల చుట్టూ తిరిగే కార్యకర్తలకు, కార్యకర్తల చుట్టూ తిరిగే నాయకులకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పేదరికం లేని సమాజం కోసం: రాష్ట్ర జనాభాను పెంచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కనీసం ఇద్దరు పిల్లలకు తక్కువ కాకుండా దంపతులు ఆలోచన చేయాలని కోరారు. పేదరికం లేని సమాజం కోసం పీ4, మార్గదర్శి-బంగారు కుటుంబం తీసుకొస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టించాలి, ఆ సంపద పేదలకు చేరాలనేదే తన లక్ష్యమన్నారు. అట్టడుగున ఉన్నవారిని సంపన్నులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేస్తే తెలుగుదేశం పార్టీకి తిరుగు ఉండదని సీఎం చంద్రబాబు శ్రేణులకు సూచించారు.
పీకపై కత్తిపెట్టినా సరే ‘జై తెలుగుదేశం’ నినాదమే: నారా చంద్రబాబు