Mirchi Price Come Down in Andhra Pradesh: ధరలుంటే మిరప ఎర్ర బంగారమే. చీడపీడలతో దిగుబడులు తగ్గినా, అంతర్జాతీయ ఒడుదొడుకులతో డిమాండు లేక ధరలు పతనమైనా అది మిరప రైతుల్ని కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఈ ఏడాది పరిస్థితి అదే. గతేడాది ఫిబ్రవరి వరకు క్వింటాల్కు 20వేలకు పైగా లభించిన ధర తర్వాత క్రమంగా తగ్గుతూ 9 నుంచి 13 వేల మధ్యకు తగ్గిపోయింది. పంట విక్రయిస్తే వచ్చే డబ్బులు కూలీల ఖర్చులు, ఎరువుల దుకాణాలకే సరిపోడవం లేదని రైతులు వాపోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేశారు. రెండేళ్లుగా క్వింటా మిర్చి 20 వేలకు పైగా ధర పలకడంతో ఈ సారి కూడా అవే ధరలు ఉంటాయని పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి మిర్చి పండించారు. ఎకరాకు 3లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి సాగు చేస్తే మిర్చికి మార్కెట్లో ధర లేక 50వేల నుంచి లక్ష వరకు నష్టం వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. క్వింటాల్కు 11 వేల 781 ధర దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిర్ణయించిన ధరకు అనుగుణంగా నష్టపోయిన రైతుకు సాయం అందేలా చూస్తామని చెప్పినా ఇప్పటికీ విధి విధానాలు ఖరారు చేయలేదని రైతులు చెబుతున్నారు. ఈ-పంట, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలను దుకాణాల నిర్వాహకులు తీసుకుంటున్నా సాయం అందుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నారు.
వాస్తవానికి 2023-24 సంవత్సరంతో పోలిస్తే 2024-25 సంవత్సరంలో మిరప సాగు సుమారు 2.13లక్షల ఎకరాలు తగ్గింది. నష్టభయంతోనే మూడెకరాలు వేసే రైతులు రెండెకరాలు, ఎకరాకే పరిమితమయ్యారు. సాగు, ఉత్పత్తి తగ్గితే ధరలు కలిసొస్తాయని ఆశించారు. క్వింటాల్కు కనీసం 15వేలకు తగ్గకుండా లభిస్తుందని అనుకున్నారు. తీరా పంట చేతికొచ్చేసరికి అది కాస్తా మరింత తగ్గి 10వేలు కూడా దక్కడం లేదని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో కేంద్రం క్వింటాల్కు 11 వేల 781 చొప్పున ధర నిర్ణయించింది. అదీ ఎక్కడా అమలు కావడం లేదని రైతులు చెబుతున్నారు. మిర్చి అమ్మగా వచ్చిన సొమ్ము కూలీలు, ఎరువులు దుకాణాల్లో అప్పులు కట్టడానికి కూడా సరిపోవడం లేదని, తమ జీవనం మాటేమిటనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబరు 2023 నుంచి 2024 మే నెల వరకు గుంటూరు మిర్చియార్డుకు 98 లక్షల 63 వేల 975 బస్తాలు అమ్మకానికి రాగా డిసెంబరు 2024 నుంచి ఏప్రిల్ 16 వరకు 89 లక్షల 98 వేల 33 బస్తాల సరకు వచ్చింది. సన్న రకాలకు క్వింటాల్కు 13వేల వరకు ధర లభిస్తోంది. వీరు ఎకరానికి 50వేల వరకు నష్టపోతున్నారు. ఇతర రకాలకు ధర 10వేల వరకే ఉంది. దీంతో వాటిని సాగు చేసిన రైతులకు నష్టం మరింత పెరుగుతోంది.
''ఎక్కువ మొత్తంలో మిర్చిని సాగు చేశాం. దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు వచ్చినప్పటికీ ధర మాత్రం క్వింటాకు రూ. 8 వేలు అంటున్నారు. దీని వల్ల మాకు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. అంతే కాకుండా కూలీలకు డబ్బులు కూడా భారీ మొత్తంలో అయింది. కిందటి సంవత్సరం క్వింటాకు రూ 18-19వేలు ధర పలికింది. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి'' -బాధిత రైతులు
గతేడాది పంటకు గిట్టుబాటు ధర లేదు - ఉన్న పంటపై బొబ్బర, నల్లి తెగుళ్ల దాడి
కన్నీరు పెట్టిస్తున్న మిర్చి - 'గిట్టుబాటు' కాలేదంటున్న అన్నదాతలు - Mirchi farmers