'కరెంటు తీసేస్తే - మా నాన్న ఊపిరి ఆగిపోతుంది' : ప్లీజ్ హెల్ప్ చేయండి
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లేకపోతే ఊపిరి తీసుకోలేని తండ్రి - నెలకు రూ.వేలల్లో కరెంట్ బల్లు - కొవిడ్ సోకి నాలుగేళ్లుగా మంచానికే పరిమితం - దాతలు ఆదుకోవాలని కోరుతున్న కుటంబసభ్యులు

Published : July 11, 2025 at 12:02 PM IST
|Updated : July 11, 2025 at 12:18 PM IST
Children Seeking Help for their father's Medical Condition : రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబంలో కరోనా కాటు ఇప్పటికీ చెరగలేదు. దీని కారణంగా ఇంటికి పెద్ద దిక్కైన నాన్న మంచానికే పరిమితం అయ్యారు. కరోనా పోయి ఇన్నేళ్లయినా అది చేసిన విధ్వంసం ఇప్పటికీ వారి కళ్ల ముందు కదలాడుతోంది. 'మా నాన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లేకపోతే ఊపిరి తీసుకోలేరు. దీనిని వినియోగించడం వల్ల మా ఇంట్లో కరెంటు బిల్లు బాగా పెరిగిపోయింది. నెలకు రూ.వేలల్లో వస్తున్న విద్యుత్ బిల్లును కట్టే స్తోమత మాకు లేదు. ఇప్పటికే రూ.80 వేల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బకాయిలు ఉన్నా, ఇంతకాలం గడువు ఇస్తూ వచ్చిన విద్యుత్ అధికారులు, ఇక కరెంట్ కనెక్షన్ తొలగిస్తామని అంటున్నారు. కరెంట్ కట్ చేస్తే మా నాన్న ప్రాణం పోతుంది. దాతలు ఎవరైనా మాకు సాయం చేసి మా నాన్నకు ఊపిరి పోయండి' అని ఆ ఇద్దరు చిన్నారులు దీనంగా వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే,
ఉన్నదంతా ఆసుపత్రులకే : హనుమకొండలోని దర్గా కాజీపేటకు చెందిన తీగల సాంబమూర్తి (37) ఎలక్ట్రీషియన్గా పని చేస్తూ భార్య సంధ్య, కుమార్తె రిషిక, కుమారుడు ప్రణయ్లను పోషించుకునే వారు. 2021లో ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆసుపత్రుల్లో చేరి ఉన్నదంతా ఖర్చుపెడితే ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, వైరస్ ఆయన ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఇక జీవితాంతం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పైనే ఆధారపడి జీవించాల్సిందే అని వైద్యులు చెప్పారు. దీంతో సాంబమూర్తి 4 సంవత్సరాలుగా మంచానికి పరిమితమై జీవనపోరాటం సాగిస్తున్నారు.
మానవతా దృక్పథంతో ఇన్నాళ్లూ గడువు : భార్య వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో రోజువారీ కూలీగా పని చేస్తున్నారు. ఆమెకు వచ్చే జీతం కుటుంబ అవసరాలు, సాంబమూర్తి మందులకే సరిపోతుండటంతో సుమారు రెండేళ్లుగా కరెంటు బిల్లు కట్టడం లేదు. విద్యుత్తు శాఖ ఉద్యోగులు మానవతా దృక్పథంతో ఇన్నాళ్లూ గడువు ఇస్తూ వచ్చారు. ఇకపై బిల్లు కట్టకపోతే కనెక్షన్ తొలగించాల్సి ఉంటుందని చెప్పారు.
ఈ ఫోన్ నంబరును సంప్రదించండి : ‘బిల్లు కట్టే పరిస్థితి మాకు లేదు. కరెంటు తీసేస్తే మా నాన్న ఊపిరి ఆగిపోతుంది’ అని పిల్లలు కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేసే వారు ఫోన్ నంబరు 7396174727 ను సంప్రదించాలని కోరుతున్నారు.
‘ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లేకపోతే మా నాన్న ఊపిరి తీసుకోలేరు. దీన్ని వినియోగించడం వల్ల మా ఇంట్లో కరెంట్ బిల్లు నెలకు రూ. వేలల్లో వస్తోంది. ఆ బిల్లును కట్టే స్థోమత మాకు లేదు. ఇప్పటికే బిల్లు రూ.80 వేల వరకు బకాయిపడ్డాం. ఇన్నాళ్లూ గడువు ఇచ్చిన అధికారులు, ఇక ఉపేక్షించేది లేదని, విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని అంటున్నారు. అదే జరిగితే మా నాన్న ప్రాణం పోతుంది. దాతలు మా నాన్నకు ఊపిరి పోసి ఆదుకోండి’ - బాధితుని కుమారుడు, కుమార్తె
ఆ యువకులంతా దినసరి కూలీలే - ఆపదొస్తే మాత్రం కోటీశ్వరులైపోతారు!
సాయం చేస్తే సంపూర్ణ జీవితం - 15 ఏళ్ల బాలుడి గుండె మార్పిడికి సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు

