Board of Secondary Education in Telangana : పదో తరగతిలో ఈ సారి మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 8న పాఠశాల విద్యాశాఖ నుంచి ప్రతిపాదన పంపగా దాదాపు 20 రోజుల సమయంలో నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇచ్చారు. గత సంవత్సరం వరకు పదో తరగతిలో సబ్జెక్టులవారీగా గ్రేడింగ్తో పాటుగా క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ (సీజీపీఏ) ఇచ్చేవారు.
పాస్, ఫెయిల్ : ఇక నుంచి పదో తరగతి మెమోల్లో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. జీపీఏ అనేది తీసివేయనున్నారు. మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా? అనేది వివరంగా ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల(కో కరిక్యులర్ యాక్టివిటీస్)లో స్టూడెంట్స్కు గ్రేడ్లు ఇస్తారు.
సీబీఎస్ఈ తరహాలోనే : వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్ యాక్టివిటీస్కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రిస్తారు. ప్రస్తుతం సీబీఎస్ఈలో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లను ముద్రిస్తున్నారు. సీబీఎస్ఈలో అన్ని సబ్జెక్టుల మార్కులు కూడి, మొత్తం ఎన్ని మార్కులో ఇవ్వడం లేదు. ఇక్కడా అదేవిధంగా ఉంటుందా? అందుకు భిన్నంగా మొత్తం మార్కులు పొందుపరుస్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఫలితాల విడుదలకు తొలగిన అడ్డంకి : టెన్త్ క్లాస్ మార్కుల మెమోలు ఎలా ఉండాలన్న విషయంపై ఇప్పుడు ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో ఫలితాల విడుదలకు అడ్డంకి తొలగినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పదో తరగతి ఫలితాలను రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇంతవరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్గా ఉన్న ఈవీ నరసింహారెడ్డి బదిలీ అయ్యారు. ఆ స్థానంలో మరో అధికారిని ఇంకా నియమించలేదు. కొత్త అధికారి లేకుండా విడుదల చేయొద్దనుకుంటే ఒకట్రెండు రోజులు ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
టెన్త్ తర్వాత ఏం చేయాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారా? - ఇది చూస్తే ఫుల్ క్లారిటీ!