BETTING APPS CASE UPDATE: బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారిలో ఉన్న ప్రముఖ నటులపై కేసులు నమోదవుతున్నాయి. పలువురు ప్రముఖ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కేసు నమోదైంది. వీరిలో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నీతూ అగర్వాల్ ఉన్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా వీరితో పాటు శ్యామల, శ్రీముఖి, రీతూ చౌదరి, విష్ణుప్రియ, వర్షిణి, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, వసంతికృష్ణన్, శోభాశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ఖాన్, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రిత మొత్తం 25 మందిపై తెలంగాణలోని మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
కాగా బెట్టింగ్యాప్స్కి సంబంధించి ప్రమోషన్లు చేస్తే సెలబ్రిటీలకు లక్షల్లో డబ్బులొస్తున్నాయి. కొందరు తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్చేస్తే, మరి కొంతమంది డబ్బుకోసం చేశారు. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ను ప్రమోట్ చేస్తే వారికి వ్యాపార యాడ్ కంటే ఎక్కువ ఇస్తున్నారు. అధికడబ్బుకు ఆశపడి యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్లు, పలువురు యాక్టర్లు ప్రమోట్ చేసి సొమ్ము చేసుకున్నారు. అలాంటి వీడియోలను చూసిన కొందరు సామాన్యులు తమ డబ్బులకు పోగొట్టుకున్నారు. తమ అభిమాన వ్యక్తులు చెప్తుండటంతో, బెట్టింగ్ యాప్లలో భారీగా పెట్టుబడిపెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఇలాంటి కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువయ్యాయి.
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో అప్పట్లో విశాఖపట్నంలో యూట్యూబర్ లోకల్ బాయ్నాని అనే వ్యక్తిపై సైబర్క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. అదే విధంగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన మోటర్రైడర్ సన్నీయాదవ్పైనా కేసు నమోదైంది. పలువురు బిగ్బాస్ సెలబ్రిటీలు, యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్లు, వాళ్ల ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అకౌంట్లలో బెట్టింగ్ యాప్స్ను విచ్చలవిడిగా ప్రమోట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణలో కేసులు నమోదయ్యాయి.
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలకు దూరంగా ఉండాలని మీడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ఆదేశాల్ని పాటించకుండా బెట్టింగ్ యాప్ సంస్థలు ప్రమోషన్లు చేయడంతో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపై యుద్దం ప్రకటించారు. పలువురు సెలబ్రిటీలు ఆయన్ను కలిసి తెలియక తప్పుచేశామని, క్షమించాలంటూ కోరారు.