Career Tips in Telugu For Students : ప్రతిభ ఒకరి నుంచి దొంగలించేది కాదు, తమను తామే మెరుగుపర్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే విజయాలు దరిచేరుతాయి. కొందరికి ఒకే ప్రయత్నం, మరికొందరికి అనేక అనేక మార్లు శ్రమించాలి. మంగళవారం ఇంటర్, త్వరలో పదో తరగతి వార్షిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పరీక్షల్లో విద్యార్థులు అనుత్తీర్ణులైనా బాధపడొద్దు. మళ్లీ అవకాశం ఉందన్న విషయం మర్చిపోవద్దు. ఆత్మ నిబ్బరంతో అడుగేయాలి. ఈ సమయంలో తల్లిదండ్రులు, కుటుంబం అండగా నిలవాలి. మార్కులు ఆశించిన మేర రాలేదని, అనుత్తీర్ణులయ్యామనే భావనను దరి చేరనీయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు : అంశమేదైనా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు, ఇతరులతో పోలిస్తే అత్యధిక మంది బాలలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు. చదువు, పరీక్షల వరకు మార్గదర్శనం ఎంత ముఖ్యమో, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అంతే. ఆసక్తి ఉన్న రంగాల వైపు ప్రోత్సహించాలి. ఉన్నత స్థాయిలో రాణించిన వారి గురించి చెప్పాలి.
ఆశించిన ఫలితం రాలేదని, అనుత్తీర్ణులయ్యామనే భావనలో కొందరు విద్యార్థులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికమైన ఆలోచనతో సరిదిద్దుకోలేని నిర్ణయం తీసుకుంటున్నారు. దీన్ని అధిగమించి, ఆశావహ దృక్పథంతో అడుగేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
కుటుంబం గురించి ఆలోచించాలి : వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని గతేడాది ఇంటర్లో ఫెయిల్ కాగా ఆత్మహత్య చేసుకుంది. ఒక్క కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రుల వేదన ఎప్పటికీ తీరనిది. అందుకే క్షణికావేశంలో నిర్ణయం తీసుకునే ముందు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
వివిధ రంగాల్లో రాణిస్తున్న వారంతా పడి లేచిన వారే. ఓటమి గెలుపునకు తొలిమెట్టుగా భావించాలని ప్రముఖులు సూచిస్తుంటారు. ఇంటర్ వరకే చదివిన సచిన్ తెందూల్కర్ 16 ఏళ్లకే క్రికెట్లో అడుగుపెట్టి ఎన్నో రికార్డులు సాధించారు.
చదివింది పదో తరగతే : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన అల్గోల్ నర్సమ్మ పదే తరగతే చదివింది. ఇక్కడి డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)లో చేరి పట్టుదలతో చిరుధాన్యాల సాగు చేపట్టి అధిక దిగుబడి సాధించారు. సొసైటీ ఆధ్వర్యంలో రేడియోను ప్రారంభించి నిర్వహిస్తున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.
- తూప్రాన్ మండలం మల్కాపూర్కు చెందిన కృష్ణ పలు కారణాలతో ఇంటర్ పూర్తి చేయలేకపోయారు. దీంతో తనకు ఆసక్తి ఉన్న వ్యవసాయంలో అడుగుపెట్టి ఆదర్శంగా నిలిచారు. నాలుగెకరాల పొలం ఉండగా పంటల సాగు చేపట్టారు. అధిక దిగుబడి సాధిస్తున్నారు. నిత్యం కూరగాయలను హైదరాబాద్లోని మాల్స్కు పంపిస్తున్నారు. మరోవైపు పాడి వైపు దృష్టిసారించి ఆదాయం ఆర్జిస్తున్నారు.
- సాయిలుచారి వట్పల్లి మండలం మర్వెల్లి జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఇంటర్ పరీక్షల్లో తప్పినా కుంగిపోలేదు. పట్టుదలతో చదివి తిరిగి ఉత్తీర్ణత సాధించారు. డిగ్రీ, పీజీ దూరవిద్యలోనే పూర్తిచేశారు. తెలుగు పండిట్ శిక్షణ పూర్తి చేశారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టారు. మరోవైపు రచనలు సాగిస్తున్నారు.
చదువు, ఫలితాలే జీవితం కాదని అనుత్తీర్ణులైన వారూ ఆ తర్వాత ఉన్నతంగా ఎదిగారని వ్యక్తిత్వ వికాస నిపుణులు ఉమాపతి తెలిపారు. గతేడాది పలువురు తప్పుడు నిర్ణయాలతో తల్లిదండ్రులకు శోకం మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం అమూల్యమైందని, ఒక్కసారి కోల్పోతే మళ్లీ రాదన్నారు. నచ్చిన రంగంపై పిల్లలు ఆసక్తి చూపాలని, తద్వారా అద్భుత విజయాలు సొంతమవుతాయని పేర్కొన్నారు.