Capital Amaravati Construction Works : రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ పరుగందుకుంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తిస్థాయిలో పట్టాలెక్కింది. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు, కాలువల అభివృద్ధి, రిజర్వాయర్ల నిర్మాణం వంటి ప్రధాన మౌలిక వసతులు, రైతులకు స్థలాలిచ్చిన లేఔట్ల అభివృద్ధికి 64వేల కోట్లతో అంచనాలు రూపొందించి రూ. 50వేల కోట్లకుపైగా పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. 8వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈ పనులన్నీ మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ వంటి నిర్మాణాల కోసం మలిదశలో 45వేల ఎకరాల భూసమీకరణకు సిద్ధమైంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టి విధ్వంసానికి పూనుకుంది. ఐదేళ్లలో ఒక్క ఇటుక రాయి వేయకపోగా ‘అమరావతి బ్రాండ్ ఇమేజ్’ని తీవ్రంగా దెబ్బతీసింది. జూన్ 12న పాలనా పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అమరావతిని తొలి ప్రాధాన్యంగా ఎంచుకుని పునర్నిర్మాణానికి నడుం కట్టింది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు, వేసిన చిక్కుముళ్లు తొలగించేందుకే కూటమి ప్రభుత్వానికి మొదటి ఎనిమిది నెలలు సరిపోయింది. రాజధాని పనుల్ని నిలిపేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుత్తేదారులు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదు సరికదా, బ్యాంక్ గ్యారంటీలూ తిరిగి ఇవ్వలేదు. వారితో కాంట్రాక్టులు రద్దుచేయలేదు.
అడ్డంకులు తొలగించేందుకే 8నెలలు: ఇప్పుడు పాత ఎస్ఎస్ఆర్ ధరలకు పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో కూటమి ప్రభుత్వం వారితో కాంట్రాక్టులను రద్దుచేసి, దానికి అసెంబ్లీ ఆమోదం పొందింది. న్యాయసమీక్ష, రివర్స్ టెండరింగ్ లాంటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల్ని రద్దుచేసేందుకు, ఐదేళ్లపాటు నీళ్లలో నానిన ఐకానిక్ టవర్ల పునాదుల పటిష్ఠతను ఐఐటీ నిపుణులతో మదింపు చేయించడానికి మరింత సమయం పట్టింది. మొత్తంగా 8 నెలలు దానికే పోయింది. తర్వాత నాలుగు నెలల్లో చకచకా టెండర్లు పిలిచింది. రాజధానిలో ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని 73 ప్యాకేజీలుగా విభజించింది. వాటిలో 65 పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలవాల్సి రావడంతో అంచనా వ్యయం 20-25 శాతం పెరిగింది. అంటే 15 వేల కోట్ల వరకు అదనపు భారం పడింది.
రాజధానిలో నిర్మాణ పనులు పనుల పురోగతిని ఈటీవీ భారత్-ఈనాడు బృందం తాజాగా పరిశీలించింది. చాలా పనులు మొదలై, వేగంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల కార్మికులు పని చేస్తున్నారు. వారికోసం నిర్మాణ సంస్థలు నివాస ప్రాంతాల్ని ఏర్పాటు చేశాయి. 3.62 ఎకరాల్లో ఏడు అంతస్తులతో సీఆర్డీఏ కార్యాలయం పనులు వేగంగా సాగుతున్నాయి. దీనికి ఎదురుగా ప్రీఫ్యాబ్రికేటెడ్ విధానంలో మరో రెండు కార్యాలయాలు నిర్మిస్తున్నారు. పురపాలకశాఖ పరిధిలోకి వచ్చే టిడ్కో, మెప్మా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వంటి విభాగాల కార్యాలయాలు వాటిలో వస్తాయి. 360 కిలోమీటర్ల పొడవైన ప్రధాన రహదారుల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ. 930 కోట్లతో చేపట్టిన హ్యాపీనెస్ట్ పనులు ప్రారంభమయ్యాయి. పైల్స్ వేయడం పూర్తయింది. నేలపాడు వద్ద 12 టవర్లలో మొత్తం 1,200 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణపనులు వేగంగా జరుగుతున్నాయి. మరో ఏడాదిలో అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. న్యాయమూర్తులు, మంత్రుల బంగ్లాల పనులు జరుగుతున్నాయి. కొండవీటి వాగు విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. 40 కిలోమీటర్ల పరిధిలో కొండవీటి వాగు, పాలవాగును అభివద్ధి చేస్తున్నారు. శాఖమూరు, కృష్ణాయపాలెం వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. 2027 మార్చికి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుళ్లూరులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రధాన బ్లాక్ పనులు చివరిదశకు వచ్చాయి. మన రాష్ట్ర పోలీసులకే కాకుండా ఇతర రాష్ట్రాల పోలీసులకూ ఉపయోగపడేలా దీన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఇదే వేగంతో పనులు జరిగితే ఐదు కోట్ల మంది ఆంధ్రుల కల త్వరలోనే సాకారమవుతుంది.
అమరావతిలో క్వాంటం వ్యాలీ - ఎంఓయూ ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు
క్యూ కడుతున్న విద్యాసంస్థలు: అమరావతిలో 2014-19 మధ్య భూములు తీసుకున్న వివిధ ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు నిర్మాణాలకు సిద్ధమవుతున్నాయి. కొన్ని సంస్థలకు మంత్రుల కమిటీ కేటాయింపులు రద్దుచేసింది. కొన్నింటికి పునరుద్ధరించింది. కొత్తగా మరిన్ని సంస్థలకు అనుమతులిచ్చింది. ప్రముఖ విద్యాసంస్థలు అమరావతికి క్యూ కడుతున్నాయి. బిట్స్, ఎక్స్ఎల్ఆర్ఐ, నేషనల్ లా యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ విలేజ్ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయించింది. ఐటీ టవర్ల నిర్మాణానికి ఎల్ అండ్ టీ సంస్థకు 10 ఎకరాలు కేటాయించింది. ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో 600 కోట్లతో ప్రవాసాంధ్రులు ఐకానిక్ భవనాన్ని నిర్మిస్తున్నారు.
500 పడకలతో ఈఎస్ఐ సెకండరీ కేర్ ఆస్పత్రితో పాటు, 150 పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.అంతర్జాతీయ స్థాయి గార్డెన్ సెంటర్ నెలకొల్పేందుకు ఇజ్రాయెల్ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుకు సింగపూర్ సంస్థల కన్సార్షియంతో ప్రభుత్వం చర్చిస్తోంది.
అమరావతికి ఇన్నర్ రింగ్రోడ్డు : అమరావతి ఔటర్ రింగ్రోడ్డు ప్రాజెక్టును 189.4 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా చేపట్టేందుకు కేంద్రం అంగీకరించింది. భూసమీకరణ వ్యయాన్నీ కేంద్రమే భరించనుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మాణానికి భూసేకరణ జరుగుతోంది. అమరావతికి ఇన్నర్ రింగ్రోడ్డు ప్రతిపాదన కూడా ఉంది. రాజధాని అమరావతిలోని సీడ్యాక్సెస్ రోడ్డు మాత్రమే చెన్నై-కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించేలా అప్పట్లో ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు దాంతోపాటు మరో మూడు రహదారులనూ చెన్నై-కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తున్నారు.
కాజ నుంచి గొల్లపూడి మీదుగా చిన అవుటపల్లి వరకు విజయవాడ బైపాస్ రహదారి సెప్టెంబరుకల్లా అందుబాటులోకి వస్తుంది.హైదరాబాద్లోని శంషాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే ప్రతిపాదన ఉంది. కర్ణాటక, ఏపీ సరిహద్దులోని కోడూరు క్రాస్ నుంచి బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వరకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తున్నారు. దాన్ని అమరావతితో అనుసంధానిస్తూ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణం ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఇవన్నీ ఆచరణలోకి వస్తే అమరావతికి అద్భుతమైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. అతి త్వరలోనే హైదరాబాద్కి దీటైన నగరంగా ఎదుగుతుంది.
కేెద్రం అండదండలు: రాజధాని నిర్మాణానికి ఈ సారి కేంద్రం పూర్తిస్థాయిలో అండదండలు అందించడం సానుకూల పరిణామం. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ఈసారి టీడీపీ కీలకమైన భాగస్వామి కావడంతో అమరావతికి అన్నివిధాలా అండగా ఉండేందుకు మోదీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిందే తడవుగా అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రం చొరవ తీసుకుని ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి 15వేల కోట్లు ఇప్పించింది. దాన్ని రాష్ట్రానికి గ్రాంటుగా ఇస్తున్నామని, ఆ రుణాన్ని తామే తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
హడ్కో 11వేల కోట్లు రుణం ఇస్తోంది. 5వేల కోట్ల రుణం కోసం జర్మనీ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూతో సంప్రదింపులు జరుగుతున్నాయి. మిగతా నిధుల్ని ఇతర బ్యాంకులు, ఆర్థికసంస్థల నుంచి, బాండ్ల జారీ ద్వారా సమకూర్చుకోనుంది. రాజధాని నిర్మాణానికి తీసుకునే రుణాలు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా మినహాయింపు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలన్న విజ్ఞప్తిపైనా సానుకూలంగా స్పందించింది.
భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లిని కలిపి మహానగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో భాగంగా భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం ఇప్పటినుంచే తగిన ప్రణాళికలు రూపొందిస్తోంది. దానిలో భాగంగానే మలిదశలో సుమారు 45వేల ఎకరాల భూసమీకరణకు సిద్ధమైంది. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ, 1.25 లక్షల మంది వీక్షించే సామర్థ్యంతో క్రికెట్ స్టేడియం, 5000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ఈ భూమిని సమీకరించనుంది. 38వేల ఎకరాల భూములు ఇచ్చేందుకు వివిధ గ్రామాల రైతులు ఇప్పటికే ముందుకొచ్చారు.
అమరావతి మహానగరికి ఓఆర్ఆర్ హారం- రాష్ట్రంలో ఇక భూములు బంగారం - Amravati Ring Road Project