Cancer Updates in Balabhadrapuram: తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య జాతీయ సగటు కన్నా తక్కువేనని అనుమానితులందరికీ పరీక్షలు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. బలభద్రపురంలో జల, వాయు కాలుష్యంపై నిపుణులతో అధ్యయనం చేయిస్తామని వెల్లడించారు. వరుసగా మూడో రోజూ వైద్య శిబిరం, వైద్య నిపుణులతోపాటు జీఎస్ఎల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్థరణ పరీక్షలు నిర్వహించారు.
ఇంటింటి సర్వే పూర్తి: క్యాన్సర్తో వణికిపోతున్న తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో బాధితులు, అనుమనితుల సంఖ్యను జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రకటించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి వైద్యులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఇంటింటి సర్వే పూర్తి చేశామని 32 మంది క్యాన్సర్ బాధితులు, 38 మంది క్యాన్సర్ అనుమానితులను గుర్తించినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు 19 మంది క్యాన్సర్తో మృతి చెందారని ఆమె తెలిపారు.
బలభద్రపురంలో మూడో రోజూ వైద్య శిబిరం నిర్వహించారు. అమరావతి నుంచి ఎన్సీడీ అధికారులు, విశాఖలోని హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి నుంచి వైద్య నిపుణురాలు, రాజమహేంద్రవరం జీజీహెచ్ నుంచి మరో వైద్యురాలితో పాటు తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల నుంచి వచ్చిన వైద్యులు రోగుల వివరాలు, గ్రామంలో పరిస్థితులను పరిశీలించారు.
"ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా క్యాన్సర్కు సంబంధించి ఎన్ని కేసులు నమోదవుతున్నాయో అన్నే ఈ ప్రాంతంలో నమోదవుతున్నాయి. క్యాన్సర్ బాధితుల సంఖ్య జాతీయ సగటు కన్నా తక్కువగానే ఉంది. అనుమానితులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడానికి ఎక్కువగా గిరిజన ప్రాంతాలైన రంపచోడవరం తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తున్నారు" -డా. సమీరజా, సర్జికల్ అంకాలజిస్ట్, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి
"మా అమ్మాయికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కలిగిందని వైద్య పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ అని వైద్యులు వెల్లడించారు. మా అమ్మాయికి గర్భసంచిలో, ప్రేగుల్లో, మూత్రపిండాల్లో అన్ని చోట్లా క్యాన్సర్ ఉందని వైద్యులు తెలిపారు. మీ అమ్మాయి రెండు మూడు నెలల కంటే ఎక్కువ రోజులు బతకదని డాక్టర్లు మాకు తెలిపారు. ఉన్నన్ని రోజులు కొంచెం జాగ్రత్తగా చూసుకోండని అధికారులు సూచించారు"-మార్తమ్మ, బాధితురాలి తల్లి, బలభద్రపురం
గ్రామంలోని పరిశ్రమ భూగర్భ జలాలను తీసుకొని కాలుష్య జలాలను తిరిగి భూమిలోకి పంపింగ్ చేస్తోందని ఎమ్మెల్యే, స్థానిక ప్రజలు ఆరోపించారు. దీనిపై పర్యావరణ నిపుణులతో తనిఖీలు నిర్వహిస్తామని కలెక్టర్ ప్రకటించారు. బలభద్రపురంలో మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ క్యాన్సర్ భూతం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దీనిపై ఆందోళన చెందవద్దని ప్రజలందరికీ వైద్యాధికారులు సూచించారు.
బలభద్రపురానికి 31 వైద్యబృందాలు - ప్రస్తుతం 32 యాక్టివ్ కేసులు: మంత్రి సత్యకుమార్
సర్వే పూర్తి కాకుండా బాధితుల సంఖ్యను ఎలా ప్రకటిస్తారు: ఎమ్మెల్యే నల్లమిల్లి
బలభద్రపురంలో 37 మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు - నేడు నిర్ధారణ పరీక్షలు