Buildings Construct by Encroaching on Ponds in Hyderabad : రాజధానిలో చెరువులు ఆక్రమించి ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్నారు. ఇలా మొత్తం 171 చెరువులు పాక్షికంగానో, పూర్తిగానో కబ్జాదారుల పరం అయ్యాయి. వీటి విస్తీర్ణం చూస్తే ఏకంగా 386.71 ఎకరాలు కావడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ (టీజీఆర్ఏసీ) తన నివేదికలో స్పష్టంగా చెప్పింది. రాజధాని ప్రాంతం ఓఆర్ఆర్ పరిధిలో చెరువుల పరిస్థితిపై టీజీఆర్ఏసీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ప్రతి చెరువుకు సంబంధించి అక్కడి ఆక్రమణలను గూగుల్ చిత్రాలతో నివేదిక రూపొందించింది. ప్రస్తుతం హైడ్రా ఏ మేరకు వీటిని కాపాడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. హైడ్రా కనీసం ఇంతవరకూ నోటీసులు కూడా జారీ చేయలేదు. ఈ చెరువుల్లో చేపట్టిన నిర్మాణాల విలువ సుమారు రూ.27 వేల కోట్ల పైమాటే అని అంచనా వేస్తున్నారు.
టీజీఆర్ఏసీ నివేదికలోని అంశాలు :
- రాష్ట్ర విభజనకు ముందు నగరంలో 920 చెరువులు ఉండగా, వీటిలో 225 పూర్తిగా, 196 పాక్షికంగా ఆక్రమణకు గురైనట్లు అధికారులు నివేదించారు. తర్వాత కాలంలో 44 చెరువులు పూర్తిగా, 127 పాక్షికంగా మొత్తం 171 చెరువులు కనుమరుగు అయ్యాయని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు స్పష్టంగా చెప్పారు.
- మియాపూర్ రామచంద్రాపురం కుంట సమీపంలో రూ.1,005 కోట్ల వ్యయంతో చెరువు భూముల్లోనే నిర్మాణాలు ప్రారంభించారు.
- గండిపేట మండలం పుప్పాలగూడలో నగరంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ రూ.1,050 కోట్ల అంచనాతో చేపట్టిన 59 అంతస్తుల నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి.
- మూసాపేట సమీపంలో 28 అంతస్తుల భారీ నిర్మాణాలు, నెక్నాంపూర్ చెంత అల్కాపూర్ టౌన్షిప్లో 11 అంతస్తుల నిర్మాణాలు, బండ్లగూడ జాగీర్లో రెండు టవర్లను చెరువుల భూములను ఆక్రమించే నిర్మాణాలు చేపట్టారు.
- పుప్పాలగూడలో 52 అంతస్తులతో నిర్మిస్తున్న అపార్టుమెంట్లు చెరువు ఆక్రమణలోనివేనని అధికారులు నివేదికలో చెప్పారు.
- గోపన్పల్లి-నల్లగండ్ల మార్గంలో 17 అంతస్తులతో నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాలు, హైటెక్ సిటీ సమీపంలో 25 అంతస్తులు ఉండే 18 టవర్లు, పుప్పాలగూడలో ఓ భారీ వాణిజ్య భవనం, గచ్చిబౌలిలో ఓ ఐటీ కమర్షియల్ పార్కును ఎఫ్టీఎల్ పరిధిలోనే నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పూర్తి అయ్యాయి. వాణిజ్య భవనం విషయమై కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్లారు.
- మూసాపేట సమీపంలో 28 అంతస్తుల భారీ నిర్మాణాలు, నెక్నాంపూర్ చెంత అల్కాపూర్ టౌన్షిప్లో 11 అంతస్తుల నిర్మాణాలు, బండ్లగూడ జాగీర్లో రెండు టవర్లను చెరువుల భూములను ఆక్రమించి చేపట్టారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మరొక నిర్మాణం : ఈ ప్రాజెక్టుల విషయం టీజీఆర్ఏసీ నివేదించినా ఇంతవరకూ హైడ్రా నోటీసులు సైతం జారీ చేయలేదు. వీటికి అన్ని రకాల అనుమతులు ఎలా వచ్చాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నీటి వనరుల్లో భారీ ప్రాజెక్టులు నిర్మాణం : నీటి వనరులను ఆక్రమించి అనేక భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు, ప్రస్తుతం నిర్మాణమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో నివాసిత ప్రాంతాలు, వాణిజ్య కట్టడాలు, హైరైజ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగానో, పాక్షికంగానో నీటి వనరులను ఆక్రమించి కడుతున్నట్లు గూగుల్ చిత్రాలు తెలియజేస్తున్నాయి. కానీ వీటికి అన్ని అనుమతులు సైతం ఉండటం ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కొన్ని నీటి వనరులను ఆక్రమించి నిర్మిస్తుంటే, మరికొన్ని ఎఫ్టీఎల్ పరిధిలోనూ ఇంకొన్ని బఫర్జోన్లోనే ఉన్నాయి.

పూర్తిగా ఆక్రమణలకు గురైన పుప్పాలగూడ చెరువు : హైదరాబాద్ నగర పరిధిలోని గండిపేట మండలం పుప్పాలగూడ చెరువు విస్తీర్ణం 19.58 ఎకరాలు. స్థిరాస్తి వ్యాపారంతో ఇది పూర్తిగా ఆక్రమణలకు గురైంది. 2014లో కొద్దిగా, 2023లో పూర్తిగా ఆక్రమణలకు గురైన విషయాన్ని ఇక్కడ గూగుల్ చిత్రాల్లో చూడవచ్చు. ఈ ప్రదేశంలో భారీ నిర్మాణాలకు రెరా, హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చాయి. జలవనరుల శాఖ నిరభ్యంతర పత్రాలు జారీ చేసింది.
పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు - అడ్డుకునేందుకు స్థానికుల యత్నం
గచ్చిబౌలిలో విరుచుకుపడ్డ హైడ్రా - సంధ్య కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం