తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు - సీఎం చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద విస్తృత తనిఖీలు
తిరుపతి ఎస్వీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపు - హెలిప్యాడ్ వద్ద 5 ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్లు ఈమెయిల్

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 6, 2025 at 3:09 PM IST
Tirupati Bomb Threat: తిరుపతి నగరం మరోసారి బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడింది. తాజాగా ఎస్వీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి (SV Agricultural University) ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈమెయిల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద 5 ఆర్డీఎక్స్ ఐఈడీలు పెట్టినట్లు పేర్కొనడంతో, పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు (BDS) తక్షణమే తనిఖీలు ప్రారంభించాయి.
హెలిప్యాడ్ పరిసరాల్లో విస్తృత సోదాలు: హెలిప్యాడ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. బాంబు స్క్వాడ్ బృందాలు, స్నిపర్ డాగ్స్ సాయంతో ప్రతి అంగుళాన్నీ పరిశీలించాయి. హెలిప్యాడ్ చుట్టుపక్కల రహదారులు, భవనాలు, వాహనాల వరకు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
మునుపటి బెదిరింపులతో సంబంధం ఉందా?: ఇప్పటికే ఈ నెల 3న తిరుపతిలోని పలు ప్రాంతాలకు ఐఎస్ఐ, మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్ల నుంచి వచ్చినట్లు అనుమానాస్పద ఈమెయిల్స్ వచ్చాయి. వాటిలో తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిల తీర్థం ఆలయం, గోవిందరాజుల స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆర్డీఎక్స్ పేలుళ్లు జరపబోతున్నట్లు హెచ్చరికలు ఉన్నాయి. అందువల్ల, తాజా బెదిరింపు వాటితో సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

