Bhubharathi Portal : రాష్ట్రంలో భూభారతి పోర్టల్ను తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు. పోర్టల్ను ఈ నెల 14న (సోమవారం) ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపైనా ఆయన సమీక్షించారు.
భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు చెందిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూభారతికి చెందిన పలు అంశాలను అధికారులకు ఆయన సూచించారు. ఈ పోర్టల్ను పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని అక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలో అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈ భూ భారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
ప్రజలకు ఈ పోర్టల్ గురించి అర్థమయ్యేలా చెప్పండి : ప్రజలు, రైతులకు అర్ధమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. వెబ్ సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ కార్యదర్శి జ్యోతి బుద్ద ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ధరణి పోర్టల్పై ఎన్నికల ప్రచారంలో విమర్శలు : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ప్రజల పాలిట శాపంగా మారిందని, భూ లావాదేవీలన్నింటినీ ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సామాన్య ప్రజలకు ఇబ్బందులను తెచ్చిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు చేసింది. భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల నుంచి ధరణి పోర్టల్లో ఎక్కించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తింది. దీంతో 20 లక్షలకు పైగా రైతులు ధరణి పోర్టల్ కారణంగా ఆగమయ్యారని ఆరోపించింది.
తమ భూమి తమ ఆధీనంలో ఉన్నప్పటికీ ధరణి పోర్టల్లో సంబంధిత రైతు పేరు ఉండేది కాదని, దీంతో ఆ భూములను క్రయ విక్రయాలు చేయలేని దుస్థితి నెలకొందని, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు అమ్ముకోలేని పరిస్థితి నెలకొందని తెలిపింది. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో దీనిని ఒక అజెండాగా పెట్టుకుని తాము అధికారంలోకి వస్తే రైతులకు రైతుల పాలిట యమకింకరగా మారిన ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడు పీసీసీ అధ్యక్షుడు, ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగా ధరణి స్థానంలో భూ భారతి పేరున నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది. రెవెన్యూ చట్టంలో అనేక మార్పులు తీసుకొచ్చింది.
లక్షలాది మంది రైతులకు గుడ్న్యూస్ - భూభారతి పోర్టల్ ఆవిష్కరణకు డేట్ ఫిక్స్
'ధరణి పోర్టల్లో ఆస్తుల వివరాలు తెలుసుకునే పరిస్థితి లేదు - కానీ భూ భారతిలో వివరాలు అన్నీ ఉంచుతాం'