Special Story on kotpally project : చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం. మధ్యలో ప్రాజెక్టు ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్లు, అలుగు నుంచి ప్రవహించేటువంటి నీరు, ఇక్కడి ప్రకృతి రమణీయత సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటోంది. వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఇరవై అయిదు కిలో మీటర్ల దూరంలో ఉన్నటువంటి కోట్పల్లి ప్రాజెక్టు జిల్లాలోనే అతిపెద్ద సాగునీటి వనరు. వికారాబాద్కు 6 కి.మీ దూరంలో ఉన్న అనంతపద్మనాభ స్వామి వారిని దర్శించుకొని అనంతగిరి హిల్స్ను తిలకించి అక్కడి నుంచి సందర్శకులు ఈ ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు వస్తుంటారు. రోజు రోజుకూ పర్యాటకుల తాకిడి క్రమంగా పెరిగి అక్కడి పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంటోంది. సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించాలని అక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే మరింత మంది పర్యాటకులను ఆకర్షిస్తుందని పలువురు కోరుతున్నారు.

కోట్పల్లి ప్రాజెక్టుకు పెరుగుతున్న పర్యాటకుల తాకిడి : కోట్పల్లి ప్రాజెక్టు అనేది 24 అడుగుల లోతు, 1784 ఎకరాల్లో విస్తరించి ఉంది. టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో పరిసర ప్రాంతాల నుంచే కాకుండా జంట నగరాలు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు ఈ ప్రాంతానికి వస్తున్నారు. వారాంతంలో, సెలవు రోజుల్లో 500-1000 వరకు, మిగతా రోజుల్లో 100-200 వరకు సందర్శకులు ఇక్కడకు వస్తుంటారు.
ప్రోగ్రెసివ్ ఇన్ తెలంగాణ, జస్టీస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బోటింగ్ కొనసాగుతోంది. అందులో నలబై మంది లైఫ్గార్డులు పనిచేస్తున్నారు. 50 వరకు వివిధ రకాల బోట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు చెక్పోస్టును ఏర్పాటు చేసి పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు.
ఇలా చేస్తే మేలు
- ప్రాజెక్టుకు సమీపంలో చిన్న పార్కును ఏర్పాటుచేసి అందులో పిల్లలు ఆడుకునేందుకు పరికరాలను, కూర్చోవడానికి వీలుగా బల్లలు ఏర్పాటుచేస్తే బాగుంటుంది.
- క్రికెట్, వాలీబాల్ తదితర ఆటలు ఆడుకునేందుకు స్థలాన్ని గుర్తించి అభివృద్ధి చేయాలని పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
- ప్రాజెక్టు చుట్టూ గ్రామీణ ప్రాంతం కావడం వల్ల పట్టణాల నుంచి వచ్చే వారికి స్థానికంగా మంచి హోటళ్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతుంటారు. హోటళ్లు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నారు.
- వర్షాకాలంలో కోట్పల్లి ప్రాజెక్టు అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. కనుచూపుమేరా నీళ్లు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఎత్తైన ప్రదేశం నుంచి వీక్షించాలంటే అక్కడ వాచ్టవర్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సేదతీరేందుకు చిన్నపాటి షెడ్ ఉండాలి.
- నీటిని చూసిన వెంటనే సందర్శకులు ఈత కొట్టేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రాజెక్టు ఎక్కువ లోతులో ఉండడం, గుంతలు, రాళ్లు కారణంగా ఈతకు వెళ్లలేక కొంతమంది నిరుత్సాహానికి గురవుతున్నారు. అక్కడ ఈత కొలను ఏర్పాటు చేసినట్లయితే అందరికీ మరింత ఉత్సాహంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది.
రాష్ట్రంలో మరో టూరిస్ట్ స్పాట్ - స్పీడ్ బోట్లతో రయ్ రయ్ మంటూ సరికొత్త జల పర్యాటకం
వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? - ఈసారి జాలీగా 'తెలంగాణ మాల్దీవ్స్'కు వెళ్లిరండి