Bandi Sanjay Letter To TSPSC Chairman : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలతో పాటు తీవ్రమైన తప్పిదాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు. వేలాది మంది అభ్యర్థులు ఆయన్ను కలిసి గ్రూప్-1 అక్రమాలపై వినతి పత్రాలు అందజేస్తుండటంతో పాటు ఆ నియామకాలను రద్దు చేయాలని, మళ్లీ పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. గ్రూప్-1 పరీక్షా ఫలితాలపై టీజీపీఎస్సీ నుంచి సమాచారం తెప్పించుకునేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు.
అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీజీపీఎస్సీదే : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానం, ఫలితాల విషయంలో అనేక అక్రమాలు, అవకతవకలు, తప్పిదాలు జరిగాయని, నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ గ్రూప్-1 అభ్యర్థులు పలుమార్లు కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తులను, ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీజీపీఎస్సీపైన ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా మార్కుల ప్రకటన, నోటిఫికేషన్ ఉల్లంఘన, పరీక్షా పత్రాల మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లతో పాటు ఉర్దూ మీడియంలో రాసిన అభ్యర్థులకు టాప్ ర్యాంకులు రావడాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. వీటికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని వారం రోజుల్లో పంపాలని ఛైర్మన్ను కోరారు.
టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి : మరోవైపు హైకోర్టులో గ్రూప్-1 కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో టీజీపీఎస్సీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అవసరమైతే తాను సైతం కేసులో ఇంప్లీడ్ కావాలని నిర్ణయించారు. అంతిమంగా గ్రూప్-1 అభ్యర్థుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని భావిస్తున్న బండి సంజయ్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో అవినీతి, అక్రమాలు, తప్పిదాలకు తావులేకుండా మెరిట్ ప్రాతిపదికగా ఉద్యోగ నియామకాలు జరిగేలా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా పలు సందేహాలను వ్యక్తం చేస్తూ వాటిని నివృత్తి చేయాల్సిందిగా టీజీపీఎస్సీ ఛైర్మన్ను కోరారు.
టీజీపీఎస్సీకి నిరాశ - సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేయడానికి సీజే ధర్మాసనం నిరాకరణ
గ్రూప్-1 పిటిషనర్లకు హైకోర్టు జరిమానా - ఎంత, ఎందుకో తెలుసా?