Young Man Excelling In Painting: ఆ యువకుడికి చిన్నతనం నుంచి చిత్రలేఖనంపై మక్కువ. కుమారుడి ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు సైతం ఆ దిశగా ప్రోత్సహించారు. ఇంకేముంది రావి ఆకులు, పేపర్లు, పెన్సిల్స్, బియ్యం గింజలు ఇలా అన్నీ తన కాన్వాస్లే అయ్యాయి. వాటిపై దేవుళ్లు, ప్రముఖుల చిత్రాలు గీస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. చిత్ర లేఖనంతో పాటు ఆకృతుల తయారీలోనూ తన సత్తా చాటుతున్న బెజవాడ యువకుడు.
నేపథ్యం: పాతికేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఉద్యోగం పేరుతో ఇష్టాలను పక్కన పెట్టేస్తున్నారు. కానీ, నేనలా కాందంటున్నాడీ యువకుడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే చిత్రలేఖనంలో అపురూప చిత్రాలు గీస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అంతేకాదు వివిధ కార్యక్రమాల్లో చిత్రాలు, ఆకృతులు గీసి అవార్డులు, ప్రశంసా పత్రాలు సాధించి శభాష్ అనిపిస్తున్నాడు.
చిత్రాలు, ఆకృతులు గీస్తున్న ఈ యువకుడి పేరు బాలు మహేంద్ర. విజయవాడకు చెందిన వీరాంజనేయులు, ధనలక్ష్మీ దంపతుల మెుదటి కుమారుడు. వృత్తి రీత్యా రైల్వేశాఖలో ట్రాక్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. చదువుకునే రోజుల్లోనే చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్నాడు. అలా ఓ వైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు ఖాళీ సమయాల్లో చిత్రలేఖనం వేస్తూ, ఆకృతులను తయారు చేస్తూ అందరిచేత ఔరా అనిపించుకుంటున్నాడు.
తల్లి ప్రోత్సాహం: చిత్రలేఖనం, ఆకృతుల తయారీలో ఇంత గుర్తింపు రావడానికి తన కుటుంబసభ్యులే కారణమని చెబుతున్నాడీ యువకుడు. ఆకృతులు చేసే క్రమంలో లోపాలు ఏమైనా ఉంటే గుర్తించి పలు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. దీంతో మరింత అందంగా తీర్చిదిద్దేందుకు అవకాశం వచ్చేది. అప్పటి నుంచి గీసిన ప్రతి చిత్రాన్నిమెుదట తన తల్లికే చూపించే వాడినని చెబుతున్నాడు బాలు.
ఉన్నత స్థాయికి వెళ్లేందుకు కృషి: చిత్రలేఖనంలో ప్రతిభ చూపినందుకు ప్రముఖుల నుంచి పలు అవార్డులను అందుకున్నాడు బాలు. రైల్వేలో బెస్ట్ ఎంప్లాయి అవార్డునూ సొంతం చేసుకున్నాడు. బయట ఎక్కడైనా అందమైన బొమ్మలు కనిపిస్తే చాలు వాటిని అందంగా తీర్చిదిద్దేవాడు. ఈ రంగంలో మరిన్ని మెళకువలు నేర్చుకుని ఉన్నత స్థాయికి వెళ్లేందుకు కృషి చేస్తానని చెబుతున్నాడు.
ఆకులు, పెన్సిళ్లు, బియ్యం గింజలపై చిత్రలేఖనం: ప్రస్తుత తరుణంలో యువత ఎక్కువ సెల్ఫోన్లు, టీవీలపై సమయం కేటాయిస్తున్నారు. అదే సమయాన్ని కొత్త విషయాలపై కేటాయిస్తే లక్ష్యాలు చేరుకోవడం కష్టం కాదంటున్నాడు బాలు. ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదవడం, చిత్రాలు గీయడం, ఆకులు, పెన్సిళ్లు, బియ్యం గింజలపై ఆకృతులు, పేర్లు గీస్తానని చెబుతున్నాడు. భవిష్యత్తులో విద్యార్థులకు ఉచితంగా చిత్రలేఖనం నేర్పిస్తానంటున్నాడు.
తల్లిదండ్రుల హర్షం: కుమారుడు చిత్రలేఖనం, ఆకృతుల తయారీలో ఉత్తమ ప్రతిభ చూపడం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు బాలు తల్లి ధనలక్ష్మి. భవిష్యత్లో మరిన్ని చిత్రాలు, ఆకృతులు గీసి ఉన్నత స్థాయికి వెళ్లేంత వరకు ప్రోత్సహిస్తూనే ఉంటామని చెబుతున్నారు.
"పాఠశాల స్థాయి నుంచి మా బాబుకు చిత్రలేఖనం అంటే ఆసక్తి. చిన్నతనం నుంచి ఎక్కడైనా ఏవైనా దృశ్యాలను చూస్తే వాటిని వేసేంతవరకు విరామం తీసుకునేవాడు కాదు. ఇవే కాకుండా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇలా అందరి చిత్రాలను వేయాలని మేము ఆశిస్తున్నాం. భవిష్యత్తులో మా బిడ్డ మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని మేము కోరుకుంటున్నాం" -ధనలక్ష్మీ, బాలు మహేంద్ర తల్లి
రైల్వేలో కొలువు చేస్తూనే చిత్రలేఖనంలో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడీ యువకుడు. భవిష్యత్లో తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే లక్ష్యమని చెబుతున్నాడు బాలు.
"పేపర్ కటింగ్ ఆర్ట్స్, పెన్సిల్ స్కెచ్ ఆర్ట్స్, పేపర్ ఆర్ట్స్ ఇలా అన్నీ చేస్తుంటాను. చిన్నప్పటి నుంచి నాకు చిత్రలేఖనం అంటే అమితాసక్తి. దానికి అనుగుణంగానే మా తల్లిదండ్రులు ఏం చేసినా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. వారి ఇచ్చిన సహకారం నేను మరవలేనిది. నేను ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి దిన పత్రికల్లో వచ్చే ఆర్ట్స్లను అన్నీ సేకరించి వాటిని సాధన చేస్తుండేవాడిని.నేను ప్రస్తుతం రైల్వేశాఖలో ట్రాక్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నాను. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు మరింత కృషి చేస్తాను" -బాలు మహేంద్ర, చిత్రకారుడు,విజయవాడ
పుట్టుకతోనే మూగ, చెవుడు - ఆత్మవిశ్వాసంతో క్రికెట్లో సత్తా చాటుతున్న యశ్వంత్