Autonomous Looting of Engineering Colleges : జేఎన్టీయూ పరిధిలోని స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన కళాశాలలు భారీగా ముడుపులు తీసుకుంటున్నాయి. వ్యక్తిగత ఇబ్బందులు, అనారోగ్యంతో తరగతులకు హాజరుకాని నాలుగో సంవత్సరం విద్యార్థుల నుంచి భారీగా దండుకుంటున్నాయి. వైద్యుడి ధ్రువపత్రం సమర్పించాక ఒక్కో విద్యార్థి నుంచి కండోనేషన్ ఫీజు పేరిట రూ.5 వేలు వసూలు చేస్తున్నారు.
చివరి సెమిస్టర్లో హాజరు తప్పనిసరి కాదని అధికారులు చెబుతున్నా కాలేజీ యాజమాన్యం వినడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. నెలలో ఐదారు రోజులు ప్రాజెక్టులు సమర్పించేందుకు కళాశాలకు వస్తే చాలని గతంలో వారే తెలిపారంటున్నారు. ఇప్పుడు మాత్రం రూ.5 వేలు చెల్లిస్తేనే పరీక్షలు రాయిస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మాట మార్చితే ఆ డబ్బును ఎలా చెల్లించాలని విద్యార్థులు వాపోతున్నారు.
నార్మల్గా రూ.500 కానీ అటానమస్లో మాత్రం : నార్మల్గా అయితే హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థులు పరీక్షలు రాయాలంటే వైద్యుడి ధ్రువపత్రం పాటు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. కానీ జేఎన్టీయూ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రం రూ.500 వసూలు చేస్తుండగా, స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రం రూ.3 వేలు నుంచి రూ.5 వేలు వరకు వసూలు చేస్తున్నారు.
ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో 8, మేడ్చల్ జిల్లాలో 4 అటానమస్ కళాశాలల యాజమాన్యాల్లో నిబంధనలకు విరుద్ధంగా వసూళ్ల పర్వం సాగుతోంది. ఇందులో మేడ్చల్ జిల్లాలోని ఓ అటానమస్ కాలేజీలో రూ.5 వేలు వసూలు చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఈ సమస్యపై జేఎన్టీయూ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.
'ఫీజు బకాయిలు చెల్లిస్తేనే - ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇస్తాం'
గాడి తప్పిన కళాశాలలపై కొరఢా - త్వరలో ఆ ఇంజినీరింగ్ కాలేజీలపై వేటు?