Rajiv Yuva Vikasam Scheme Updates : రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డుతో దరఖాస్తు చేయవచ్చని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్లికేషన్లో భాగంగా కచ్చితంగా ఆదాయ ధ్రువపత్రం కావాలని మొన్నటి వరకు అడిగారు. దీంతో ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు రావడంతో ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వర్ బిజీగా మారింది.
రేషన్ కార్డు ఉంటే చాలు : సర్వర్ బిజీగా మారడంతో ధ్రువ పత్రాల జారీ చాలా నెమ్మదిగా కొనసాగింది. ఆదాయ ధ్రువపత్రాల కోసం దరఖాస్తుదారులకు ఇబ్బందులు తలెత్తుతున్న సందర్భంలో స్పందించిన సర్కారు, తెల్ల రేషన్కార్డుతో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు దరఖాస్తుల స్వీకరణ గడువును 14వ తేదీ వరకు పొడిగించింది.
రేషన్ కార్డు లేనివారు : రేషన్ కార్డులు ఉన్నవారు దరఖాస్తులో నంబరు పొందుపరిస్తే సరిపోతుంది. లేనివారు మాత్రం తప్పకుండా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకున్నా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.
ఈడబ్ల్యూఎస్ వారికి : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వీరు కూడా రేషన్ కార్డు ఉన్నట్లయితే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఆదాయ ధ్రువపత్రం జత చేయాల్సి ఉంటుంది. ఈ పథకానికి ఎంపికైన వారికి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు రాయితీపై అందనున్నాయి. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నారు.
రాజీవ్ యువ వికాసం - అర్హులెవరు? - అప్లై చేయడం ఎలాగో తెలుసుకోండి
'రాజీవ్ యువవికాసం' పథకానికి దరఖాస్తుల స్వీకరణ - ఈ విధంగా ఈజీగా అప్లై చేసుకోండి