Applications Invited to PM Internship Scheme 2025 : ఈ ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకుంటే మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధించొచ్చు. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు పీఎం వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఉన్న ప్రముఖ కంపెనీల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన వారు ఆన్లైన్లో వివరాల నమోదుకు గడువును ఈ నెల 22 వరకు పొడిగించింది. డిగ్రీ, సాంకేతిక కోర్సులు చదివే విద్యార్థులకు ఇదొక సువర్ణావకాశం.
అర్హతలు : వృత్యంతర శిక్షణలో చేరాలనుకునే అభ్యర్థుల వయసు దరఖాస్తు తేదీ నాటికి 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. పది, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. 2023-24 సంవత్సర ఆదాయం రూ.8 లక్షలకు మించి ఉండకూడదు. అభ్యర్థులు ఇదివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన వృత్యంతర శిక్షణ పథకంలో చేరి ఉండకూడదు.
అభ్యర్థులకు ముందు ఒక పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హులైన వారికి వారు ఎంచుకునే పరిశ్రమల్లో శిక్షణ ఇస్తారు. బ్యాంకింగ్, ఐటీ, ఆటోమోటివ్, ఆరోగ్యం, రవాణా, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, విద్య, రిటైల్, ప్రభుత్వ రంగాలకు సంబంధించి వివిధ నైపుణ్యాలు నేర్పుతారు.
నెలకు రూ.5 వేల భృతి : 12 నెలల శిక్షణ కాలంలో కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.4,500, అలాగే పరిశ్రమలు రూ.500 కలిపి భృతిగా ఇస్తారు. శిక్షణ కార్యక్రమానికి అర్హత సాధించిన వారికి ఒకసారి అందించే రూ.6 వేలు అభ్యర్థుల బ్యాంకు ఖాతాకు నేరుగా జమ చేస్తారు. అభ్యర్థులకు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా రక్షణ కల్పిస్తారు.
అభ్యర్థులు https://pminternship. mca.gov.in లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆధార్ లేదా ప్రభుత్వం గుర్తించిన కార్డు, విద్యార్హతల ధ్రువపత్రాలు, అభ్యర్థి స్వీయ ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫొటో, ఈ-మెయిల్ ఐడీ, సెల్ఫోన్ నంబరు అవసరం. ఆధార్కు అనుసంధానమైన చరవాణి సంఖ్యతో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికలో వారికి ప్రాధాన్యత : బయోడేటాలో వివరాలు కచ్చితత్వంతో ఉంటే ఎంపిక ప్రక్రియలో ముందుంటారు. విద్యార్హతల్లో మంచి ఉత్తీర్ణత, శిక్షణ పొందిన అంశాలు, చదువు, సాంకేతిక నైపుణ్యాలు, దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలను బయోడేటాలో చక్కగా వివరిస్తే ఎంపికలో ప్రాధాన్యమిస్తారు. సెల్ఫోన్ నంబరు, ఈ-మెయిల్, బ్యాంకు ఖాతా, కేటగిరీల వివరాలు నమోదు చేయాలి.
ఈ కార్యక్రమాన్ని యువతకు ఉపాధికి ఓ సోపానంగా తీర్చిదిద్దారు. దేశంలోని 500 కంపెనీల్లో వివిధ రంగాల్లో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. వారికి కావాల్సిన పరిశ్రమ, రంగం, ప్రాంతాలను ఎంచుకోవడానికి అవకాశం ఉంది.
కేంద్రం కొత్త స్కీమ్ - నెలకు రూ.5వేలు స్టైఫండ్ - టాప్ కంపెనీల్లో ఇంటర్న్షిప్!
PM ఇంటర్న్షిప్ స్కీమ్కు 6.21లక్షల దరఖాస్తులు- ప్రభుత్వం ఇచ్చేది 1.27లక్షల మందికే!