APCC CHIEF YS SHARMILA ON POLAVARAM: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ప్రాజెక్టును 41 మీటర్లు ఎత్తులో నిర్మిస్తారా, 45 మీటర్ల ఎత్తులో నిర్మిస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఒకవేళ 41 మీటర్ల ఎత్తుకు పరిమితమైతే అది పూర్తిస్థాయి ప్రాజెక్టు కాదని, లిప్ట్ ఇరిగేషన్ బ్యారేజి అవుతుందని షర్మిల చెప్పారు.
పోలవరం నిర్మాణంలో రెండు ప్రభుత్వాలూ విఫలమయ్యాయి: కేంద్ర ప్రభుత్వం సైతం 41 మీటర్లకే బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేస్తుందని ఆమె గుర్తు చేశారు. 41 మీటర్లు ఎత్తైతే ముందుగా నిర్దేశించుకున్న 30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమెను పోలవరం నిర్వాసితులు కలిసి, తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, పోలవరం నిర్మాణంలో జగన్, చంద్రబాబు (Chandrababu Naidu) ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయని విమర్శించారు.
జగన్ హయాంలో ప్రాజెక్టు సర్వే సరిగా జరగలేదు: పోలవరం ప్రాజెక్టు కోసం లక్షా 6 వేల కుటుంబాలు తాత, తండ్రులు సంపాదించిన భూమిని త్యాగం చేశారని, నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని షర్మిల ఆరోపించారు. పునరావాసం చాలామందికి ఇవ్వలేదని, సర్వే సరిగ్గా జరగలేదని విమర్శించారు. నిర్వాసితులకు వారికి ఆమోదయోగ్యం కాని భూములిచ్చారని, ఇచ్చిన భూములు సైతం ముంపులోనే ఉన్నాయని అన్నారు. కేటాయించిన చోట్ల కనీస వసతులు లేవని షర్మిల చెప్పారు. జగన్ (YS Jagan Mohan Reddy) హయాంలో ప్రాజెక్టు సర్వే సరిగా జరగలేదని మండిపడ్డారు.
మళ్లీ రీ సర్వే నిర్వహించి ఆర్ అండ్ బీ ప్యాకేజీ ఇవ్వాలి: పోలవరం ప్రాజెక్టు రీసర్వే నిర్వహించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని షర్మిల అన్నారు. ఏ ప్రయోజనాలు అందకుండా ఇంకా 95 వేల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు. కేంద్రం ప్రాజెక్టును 41 మీటర్లకే పరిమితం చేస్తే రాష్ట్రానికి చెందిన ఏ ఎంపీ పార్లమెంటులో ఎందుకు అడగలేదని షర్మిల నిలదీశారు.
పహల్గాం దాడి - ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలి : వైఎస్ షర్మిల