AP INTERMEDIATE ADMISSIONS: ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను ప్రైవేటు, కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తోంది.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరువాత ఎక్కువ శాతం విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ వైపు ఆసక్తి చూపుతున్నారు. విద్యార్థులు అభిరుచికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక విద్యలోనూ చాలా మార్పులు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈనెల 1వ తేదీ నుంచే తరగతులు ప్రారంభించారు.
ఇప్పటివరకూ ఎస్సీఈఆర్టీ పుస్తకాలను విద్యార్థులు అభ్యసించారు. నూతన జాతీయ విధానం ప్రకారం ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తరగతులు నిర్వహిస్తారు. 24వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1వ తేదీన కళాశాలలు పునః ప్రారంభమవుతాయి.
ఈనెల 7 నుంచి ఫస్ట్ ఇయర్ తరగతులు: 10వ తరగతి పరీక్ష ఫలితాలు రాకముందే ఫస్ట్ ఇయర్ ప్రవేశాల ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 1వ తేదీ నుంచే దరఖాస్తులు ఇస్తున్నారు. 7వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించి, మే 31వ తేదీ వరకు చేపడతారు. 7వ తేదీ నుంచే విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి. 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఈనెల 3వ తేదీ నుంచి 9వ తేదీ దాకా జరగనుంది.
దీంతో ఫలితాలు ప్రకటించడానికి మరికొన్ని రోజులు పడుతుంది. అప్పటి లోపే తాత్కాలిక ప్రవేశాల ప్రక్రియను చేపడతారు. ఉత్తీర్ణతపై ధీమా ఉన్న విద్యార్థులు కాలేజీలలో చేరడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈనెల 23వ తేదీ వరకు తరగతులు ఉంటాయి. 24వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు సెలవులు ఇస్తారు. జూన్ 1వ తేదీ నుంచి యథాతథంగా తరగతులు కొనసాగుతాయి.
అప్లికేషన్కు హాల్టికెట్ జత చేయాలి: ఇంటర్ బోర్డు ఆదేశాల ప్రకారం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నామని, దరఖాస్తులో 10వ తరగతి హాల్టికెట్ జతచేసి అడ్మిషన్ తీసుకోవచ్చని జూనియర్ కళాశాలల ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణనాయక్ తెలిపారు. పదో తరగతి ఫలితాలు వచ్చిన తరువాత ప్రవేశాలకు గుర్తింపు ఇస్తామని అన్నారు.
ఇంటర్ ఫలితాలు వాట్సాప్లోనే చూసుకోవచ్చు!
విద్యార్థులకు గుడ్న్యూస్ - ఇంటర్మీడియట్లో సీబీఎస్ఈ సిలబస్