CONTINUOUS ELECTRICITY TO FARMERS: రాష్ట్రంలో రైతులకు పగటి పూట తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఇచ్చేలా ప్రణాళిక చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో నాలుగు విద్యుత్ ఉపకేంద్రాల ప్రారంభం, మరో మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, సవిత ముఖ్యఅతిథులుగా హాజరై మీడియా సమావేశం నిర్వహించారు.
గత ప్రభుత్వ నిర్వాకంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, వాటిని సరిచేసుకుంటూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో రైతులకు పగటిపూట తొమ్మిది గంటల నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకున్నామని ఆయన అన్నారు. మడకశిర నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా సమస్యలు పరిష్కరించడానికి నాలుగు విద్యుత్ ఉపకేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, మరో మూడు కేంద్రాల నిర్మాణానికి అనుమతి ఇచ్చామని మంత్రి గొట్టిపాటి అన్నారు.
మడకశిరలో పెద్దఎత్తున సౌర, పవన విద్యుదుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడమే లక్ష్యమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి దిశగా ఏపీ వెళ్తోందన్నారు.
మడకశిర నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వేగంగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికలు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారన్నారు. పీ-4 విధానంతో ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు సీఎం కృషి చేస్తున్నారని అనగాని అన్నారు.
వైఎస్సార్సీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. మద్యం కేసును దారిమళ్లించేందుకు గోవులు మరణించాయని ప్రచారం చేశారని అన్నారు. నాలుగేళ్లలో మడకశిరలో చివరి ఆయకట్టు వరకు నీళ్లిస్తామని మంత్రి సవిత చెప్పారు. వక్క రైతుల కోసం మడకశిరలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడిన రాజు, మడకశిరను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని నేతలు అన్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎకరా స్థలంలో నూతనంగా నిర్మించిన క్యాంపు కార్యాలయాన్ని మంత్రులు, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీ పార్థసారథిలు ప్రారంభించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ వెలుగులు - తొలిదశలో 147 చోట్ల ఏర్పాటు