AP GOVT ABOUT BIFURCATION ISSUES: విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నిధులతోనే ఏర్పాటు చేసినందున జనాభా ప్రాతిపదికన వాటిని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి స్పష్టం చేసింది. ఈ షెడ్యూల్లోని సంస్థలను విడివిడిగా కాకుండా అన్నింటినీ ఒకేసారి పంపిణీ చేయాలని కోరింది.
రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం దాటిపోయినా ఇప్పటికీ ఆస్తులు పంపకాలు పూర్తిస్థాయిలో జరగలేదు. విభజన చట్టం ప్రకారం 9వ షెడ్యూల్లో ఉన్న ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంపకాలు చేపట్టాలని కేంద్ర హోంశాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఆస్తులన్నీ ఉమ్మడి నిధులతోనే ఏర్పాటు చేసినందున ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇప్పటి లెక్కల ప్రకారం ఆ ఆస్తుల విలువ 21 వేల కోట్లకు పైగానే ఉందని, అందులో 14 వేల కోట్లు ఏపీకి ఇవ్వాలని తేల్చి చెప్పింది.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన ఫిబ్రవరి 3న ఇరురాష్ట్రాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆస్తుల పంపకాల గురించి గట్టిగానే తేల్చి చెప్పారు. విశ్రాంత IAS షీలా బిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ APSFC మినహా మిగిలిన 90 సంస్థల విభజనకు సిఫార్సు చేసింది. 24 వేల 19 కోట్ల విలువైన ఆస్తులను జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో పంచాలని సీఎస్ కేంద్ర హోంశాఖకు తెలియజేశారు. అందులో ఏపీ వాటా కింద 14 వేల 2 కోట్లు వస్తాయని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ మాత్రం 21 వేల 28 కోట్లు అడిగింది. నిపుణుల కమిటీ మాత్రం ఏపీకి 7 వేల 127 కోట్లు, తెలంగాణకు 16 వేల 891 కోట్లు పంచాలని సిఫార్సు చేసింది.
గుడ్న్యూస్ - అమరావతి-హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి గ్రీన్సిగ్నల్
ఒకే సారి పరిష్కరించడం మంచిది: 9వ షెడ్యూల్లోని ఆస్తులన్నీ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నిధులతో సృష్టించినవే కాబట్టి వీటిని జనాభా నిష్పత్తిలో పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. నిపుణుల కమిటీ సిఫార్సుల్లో పేర్కొన్న 53 కంపెనీలు/కార్పొరేషన్ల విభజన వరకు మాత్రమే ఇప్పటివరకు ఒప్పందం కుదిరిందని. మరో 15 కంపెనీలు/కార్పొరేషన్లకు సంబంధించి చేసిన సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది తప్పితే ఏపీ అంగీకరించలేదని తెలిపారు. మిగిలిన 22 కంపెనీలు/కార్పొరేషన్లపై నిపుణుల కమిటీ సిఫార్సులను తెలంగాణ అంగీకరించలేదు.
ఇప్పుడు రెండురాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన 53 కంపెనీలు/కార్పొరేషన్ల విలువ కేవలం 187 కోట్లు మాత్రమే కాగా, 15 కంపెనీలు/కార్పొరేషన్ల విలువ 4,389 కోట్లుగా ఉంది. తెలంగాణ అంగీకరించని 21 కంపెనీలు,కార్పొరేషన్ల విలువ ఏకంగా 19 వేల443 కోట్లు గా ఉంది. ఇరురాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన 53 సంస్థల విలువ అత్యల్పం, అందువల్ల అన్ని సంస్థల సమస్యలనూ ఒకే సారి పరిష్కరించడం మంచిదని సీఎస్ కేంద్ర హోంశాఖకు తెలిపారు.
విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరగా ప్రారంభించాలి: 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర ప్రాయోజిత పథకాల్లో తెలంగాణ వాటా కింద ఏపీ నుంచి 495.21 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ సీఎస్ కోరగా రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సిన కేంద్ర ప్రాయోజిత పథకాల వాటాను, అలాగే ఉమ్మడి సంస్థ లపై ఇరురాష్ట్రాలు పెట్టిన ఖర్చుల లెక్కలను త్వరగా తేల్చాలని కాగ్కు లేఖ రాయనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి హామీ ఇచ్చారు. అలాగే విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరగా ప్రారంభించాలని రాష్ట్ర అధికారులు కోరారు. దీనికి రెండేళ్ల సమయం పడుతుందని రైల్వే అధికారులు బదులిచ్చారు. తాత్కాలిక ప్రాతిపదికపై అయినా ప్రారంభించాలని కేంద్రం హోంశాఖ కార్యదర్శి రైల్వే అధికారులకు సూచించారు.
హైదరాబాద్-అమరావతి మధ్య హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి తక్షణం డీపీఆర్ తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి విజ్ఞప్తి చేయగా DPR తయారీతోపాటు ఈ ప్రాజెక్ట్కు సూత్రప్రాయ ఆమోదముద్ర వేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర హోంశాఖ రవాణాశాఖ అధికారులను కోరింది. అలాగే హైదరాబాద్- విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారిని ఆరువరుసలుగా విస్తరించే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. దీనికి సంబంధించిన DPR మొదలుపెట్టామని, ఇప్పటికే రైట్ ఆఫ్ వే అందుబాటులో ఉన్నందున అదనంగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదని కేంద్ర రహదారి, రవాణాశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. దీంతో హోంశాఖ కార్యదర్శి ఈ విస్తరణ పనులను వేగవంతం చేయాలని సీఎస్ సూచించారు.