AP Govt LOA to Assembly and HC : రాజధాని అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జారీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. టెండర్లలో ఎల్-1 బిడ్డర్లుగా నిలిచిన కాంట్రాక్టర్లకు ఎల్ఓఏ ఇచ్చేందుకు సీఆర్డీఏకి అనుమతి జారీ చేసింది. రూ.617 కోట్ల వ్యయంతో శాసనసభ భవన సముదాయం, రూ.786 కోట్లతో హైకోర్టు భవనాల సముదాయాన్ని సీఆర్డీఏ నిర్మించనుంది. అసెంబ్లీ భవన సముదాయం నిర్మాణ పనుల్ని ఎల్అండ్టీ సంస్థ, హైకోర్టు బిల్డింగ్ నిర్మాణ పనుల్ని ఎన్సీసీ లిమిటెడ్ దక్కించుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు.
అసెంబ్లీ భవనాన్ని అమరావతి ప్రభుత్వ భవన సముదాయంలోని సూపర్ బ్లాక్-ఈలో నిర్మించనున్నారు. మొత్తం 103.76 ఎకరాల్లో 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో శాసనసభ రూపుదిద్దుకోనుంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తోపాటు మూడు అంతస్తులతో దీనిని విభిన్నంగా డిజైన్ చేశారు. పైన ఎత్తైన శిఖరం ఆకారంలో ఆకృతి ఉంటుంది. లండన్కు చెందిన ఫోస్టర్స్ సంస్థ ఈ డిజైన్ను రూపొందించింది.
Amaravati Works Updates : ఇందులో మొదటి అంతస్తులో మంత్రుల ఛాంబర్లు, అసెంబ్లీ హాల్, కౌన్సిల్ హాల్, క్యాంటీన్లు, లైబ్రరీ, సెంట్రల్ హాల్ ఉంటాయి. రెండో అంతస్తులో కమిటీల ఛాంబర్లు, సభ్యుల లాంజ్, కౌన్సిళ్ల హాళ్లు, శిక్షణ కేంద్రం వంటివి రానున్నాయి. మూడో అంతస్తును నగరాన్ని చూసేందుకు ఉద్దేశించారు. మరోవైపు హైకోర్టు శాశ్వతభవనాన్ని అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్ బ్లాక్ ఎఫ్లో నిర్మించనున్నారు. మొత్తం 42.36 ఎకరాల్లో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానుంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 7 అంతస్తులతో బిల్డింగ్ను డిజైన్ చేశారు. ఏడో అంతస్తులో పూర్తిస్థాయి కోర్టు సమావేశ మందిరం, సువిశాల గ్రంథాలయం, డైనింగ్ హాల్ ఏర్పాటు చేయనున్నారు.
అమరావతిలో రూ.4,668 కోట్లతో 5 టవర్ల నిర్మాణం - టెండర్లు పిలిచిన సీఆర్డీఏ
డయాగ్రిడ్ విధానంలో ఐకానిక్ టవర్లు - 47 అంతస్తులపై హెలీప్యాడ్