Kondapalli Fort Development : ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఖిల్లాను రాజధాని ప్రాంత పర్యాటకధామంగా మార్చాలనే లక్ష్యంతో 2018 జనవరి నుంచి 2019 ఫిబ్రవరి వరకు సంవత్సరం పాటు రూ.10.90 కోట్లతో అధునాతన సాంకేతికతతో కూడిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. శత్రు దుర్భేద్యమైన కొండపల్లి కోట కేంద్రంగా సాగించిన పాలనను నాటి రాజులే స్వయంగా వచ్చి చెప్పేలా ఆగ్మెంటెడ్ రియాలిటీని జోడించారు. హైదరాబాద్ గోల్కొండలో ఉన్నట్లే కోట గోడలపై లేజర్ షో, త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ మూడు నెలలే నడిచాయి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఖిల్లా నిర్వహణను గాలికొదిలేయడంతో పెట్టిన నిధులు, పడిన శ్రమ వృథా అయ్యాయి. రూ.6 కోట్లతో తీర్చిదిద్దిన లేజర్షోకు చిన్న మరమ్మతు వచ్చిందని ఐదు సంవత్సరాలు వదిలేశారు. రూ.6 లక్షలతో ప్రస్తుతం లేజర్షోను పునరుద్ధరిస్తున్నారంటే గత పాలకుల తీరెంత దారుణమో అర్థమవుతోంది. కొండపల్లి ఖిల్లా పూర్తిగా శిథిలావస్థకు చేరగా నాడు సంవత్సరానికి పైగా శ్రమించి మరమ్మతులు చేసి మళ్లీ ప్రాణం పోశారు.
ఇసుక, సిమెంట్ వాడకుండా రాజుల కాలంలో కోట నిర్మాణానికి శాస్త్రీయ విధానంలో ఏ పదార్థాలను వాడారో పునరుద్ధరణ పనులకూ వాటినే వాడారు. గానుగ సున్నంతో కోటను నిర్మించడంతో దానినే తీసుకొచ్చారు. కరక్కాయ నీళ్లు, సున్నం, బెల్లంను కలిపి రోజుల తరబడి నానబెట్టి ఆ వచ్చిన పదార్థంతో మరమ్మతులు చేశారు. కోటకు గత రూపు తెచ్చేందుకు గోగునార, బెల్లం ఊట, కలబందలతో కలిపిన మిశ్రమాన్ని వినియోగించారు.
500 మంది కూర్చుని తిలకించేలా : లేజర్షోను 500 మంది వరకూ ఖిల్లా మధ్యలో కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. కోటను పాలించిన రాజుల చరిత్రను గ్యాలరీలో పొందుపరిచారు. పెయింటింగ్స్ వేయించారు. దర్బార్హాల్ గ్యాలరీని ఏర్పాటు చేసి మొత్తం సెంట్రల్ ఏసీ, వైఫై సౌకర్యం సమకూర్చారు. స్మార్ట్ఫోన్లో కొండపల్లి ఖిల్లా యాప్ను డౌన్లోడ్ చేసుకుని పెయింటింగ్స్ను స్కాన్ చేస్తే ఆ చిత్రంలోని రాజే వచ్చి తన చరిత్రను చెప్పేవారు. ఇందుకు జర్మనీ నుంచి తెచ్చిన అధునాతన టెక్నాలజీని వినియోగించారు.
కనీసం పట్టించుకోలేదే : రూ.కోట్లు ఖర్చుపెట్టి, జాగ్రత్తగా వారసత్వ సంపదకు విఘాతం కలగకూడదని వందల మంది కలిసి సంవత్సరం పాటు శ్రమించారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం గద్దెనెక్కాక కనీసం కొండపల్లి కోట వైపు చూడలేదు. కూటమి సర్కార్ కొలువుదీరాక ఖిల్లా ఆధునికీకరణపై ఫోకస్ పెట్టారు. తాజాగా జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశమూ అక్కడే నిర్వహించారు. లేజర్షోను అందుబాటులోకి తెచ్చేలా మరమ్మతులు చేపడుతున్నారు.

రూ.100 కోట్ల అభివృద్ధి ప్రణాళిక : కొండపల్లి ఖిల్లాను రూ.100 కోట్లతో నాలుగు సంవత్సరాల్లో దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని 2019లో సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి ప్రకటించారు. కోటలో రెండు రోజులు ఉత్సవాలు, సాహసక్రీడలు నిర్వహించారు. 11-18 శతాబ్దాల్లో దేశ చరిత్రలోనే ప్రముఖ పాత్ర పోషించిన కోటకు మళ్లీ ఆవైభవం తెచ్చేందుకు పురావస్తు, పర్యాటకశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్ నేతృత్వంలో కొండపల్లి ఫోర్ట్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. ఆ ప్రతిపాదనలన్నీ వైఎస్సార్సీపీ పాలనలో మూలకు చేరాయి.
నిర్మానుష్యంగా కొండపల్లి కోట - పాలకుల నిర్లక్ష్యమే కారణమా! - Kondapally Fort