Govt Plans to Distribute Textbooks to Schools: పుస్తకాల జాబితా ఎన్ని వచ్చాయి, ఎన్ని పంపిణీ చేశారు, ఏ పాఠశాలకు ఎన్ని వెళ్లాయి తదితర వివరాలన్నీ ఆన్లైన్ చేస్తున్నందున అంతా పారదర్శకంగా సాగుతోందని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఎన్ని పుస్తకాలు అవసరమో అవన్నీ పాఠశాలలు తెరవడానికి ముందే మండల కేంద్రాలకు చేర్చుతామని అంటున్నారు. అయితే ఈ పుస్తకాల రవాణా బాధ్యత ఆర్టీసీకి అప్పగించారు. బస్సుల్లో మండల పాయింట్లకు పంపే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి తీవ్ర కృషి చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పాఠ్య పుస్తకాలన్నీ పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పుస్తకాల పంపిణీ జాప్యం కావడం, కొన్ని రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా వేసవి సెలవులకు ముందే ఈ ఉచిత పాఠ్య పుస్తకాలు బడులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ముద్రణ పూర్తయి వచ్చిన వాటిని వచ్చినట్లే పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కావాల్సిన పుస్తకాల్లో 4.14 శాతం గోదాముకు చేరాయి. ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1430 ఉండగా 2,85,190 మంది, కృష్ణా జిల్లాలో 1804 పాఠశాలలు ఉండగా 2,38,414 మంది 1-10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ముందుగా ప్రభుత్వానికి పంపించిన నివేదిక ప్రకారం విజయవాడ ఆటోనగర్లోని జిల్లా పాఠ్య పుస్తకాల గోదాముకు ఇప్పటివరకు 1,52,266 లక్షల పుస్తకాలు చేరాయి.
జాప్యం లేకుండా సరఫరా: ఉమ్మడి జిల్లాలోని మొత్తం 5,23,604 మంది విద్యార్థులకు 34.50 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం. ప్రస్తుతానికి 1,52,266 లక్షల పుస్తకాలు వచ్చాయి. మరో 32,97,734 లక్షలు రావాలి. ప్రభుత్వం నుంచి దశల వారీగా పుస్తకాలు వస్తాయని పంపిణీలో ఎలాంటి జాప్యం లేకుండా సరఫరా చేసి పాఠశాలలు తెరిచే రోజు ఇవ్వనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు వెల్లడించారు. అంతా ఆన్లైన్లో జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి జాప్యానికి ఆస్కారం లేదని ఆయన అన్నారు.
సీనియర్ సిటిజన్స్కు డిజిటల్ కార్డు - ఫ్రీగానే పొందొచ్చు - ఉపయోగాలు ఎన్నో
నైపుణ్యాలు నేర్పిస్తూ, ఉద్యోగాలు చూపిస్తూ! - యువతకు అండగా నిలుస్తున్న సవిత