Govt Introduced Auto Mutation Service in Vijayawada: పట్టణాలు, నగరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే కొనుగోలుదారుల పేరుతో ఆస్తి పన్ను వివరాల మార్పు (ఆటోమ్యుటేషన్) జరిగే ఈ విధానాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, స్పందనను పరిగణనలోకి తీసుకుని మార్పుచేర్పులతో మిగిలిన కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధుల్లో కొద్దికొద్దిగా విస్తరించాలని భావిస్తోంది. వ్యవసాయ భూముల విషయంలో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానాన్ని పట్టణాలు, నగరాల్లో ఆస్తుల కొనుగోళ్లకూ అమలుచేసే విషయమై ప్రభుత్వం కొద్దికాలం నుంచి కసరత్తు జరుగుతోంది.
కొత్త ఫ్లాట్ల కొనుగోలుకు కూడా విధానం అమలు: ఈ క్రమంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎసెస్మెంట్ నంబర్లపై ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు జరిగే ఆస్తుల క్రయవిక్రయాలకు మాత్రమే ఆటో మ్యుటేషన్ విధానాన్ని అమలుచేసేలా చర్యలు తీసుకున్నారు. ఎసెస్మెంట్ నంబరు కలిగిన పూర్తి ఆస్తి అమ్మకం జరిగితేనే ఈ ప్రక్రియ వర్తిస్తుంది. కొత్త ఫ్లాట్ల కొనుగోలుకు కూడా ఈ నూతన విధానాన్ని అమలు చేస్తారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆ వివరాలు సంబంధిత కార్పొరేషన్ అధికారులకు ఆన్లైన్ ద్వారా తెలియజేస్తారు. అక్కడ పరిశీలించి, అంగికరించిన అనంతరం ఆన్లైన్లోనే 'ఆటోమ్యుటేషన్ సర్టిఫికెట్' జనరేట్ అవుతుంది. దీనిని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా కొత్త డాక్యుమెంట్లతో పొందే విధంగా చర్యలు తీసుకున్నారు.
అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్: ఈ నెల 30వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమల్లోకి తెచ్చేందుకు వీలుగా రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలుత కంకిపాడు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ ఫలితాల ఆధారంగా ఈ నెల 4వ తేదీన ఆ విధానాన్ని జిల్లా కేంద్రాల్లోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించారు. మిగిలిన కార్యాలయాల్లోనూ మరో దశ (ఈ నెల 21, 26, 30 తేదీల్లో)ల్లో ఈ స్లాట్ బుకింగ్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మీ ఆస్తి పత్రాలు పోయాయా? - టెన్షన్ ఎందుకు దండగ 'సీసీ' ఉండగా
ఏసీబీ అధికారుల సోదాలు - వందల కోట్ల ఆస్తి పత్రాలు మూటగట్టి విసిరేశారు!