AP Govt Install Transponders to Fishing Boats: సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు తీరం నుంచి వందల నాటికల్ మైళ్ల దూరం ప్రయాణిస్తుంటారు. వారంతా కుటుంబాలకు దూరంగా రోజుల తరబడి నడి సంద్రంలో వేట సాగించినా కొన్ని సందర్భాల్లో చేపల జాడ లేక వట్టి చేతులతో ఒడ్డుకు తిరిగి వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో తుపాన్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాగరంలో అల్లకల్లోల పరిస్థితులతో ప్రమాదాల బారిన పడుతున్నారు. మత్స్యకారులు వినియోగించే సెల్ఫోన్లకు సిగ్నల్స్ లేక తుపానుల ముప్పు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అయితే వీరి కోసం ప్రభుత్వం ఓ నూతన విధానం ప్రవేశపెట్టింది.
ట్రాన్స్పాండర్ ఏర్పాటు: సముద్రంలో చేపల సంచారం గుర్తించేందుకు, తుపాను, ఇతర ప్రకృతి విపత్తుల సమాచారం ముందస్తుగా తెలుసుకునేందుకు వీలుగా ప్రభుత్వం బోట్లకు ట్రాన్స్పాండర్ల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది. వీటి ఏర్పాటుతో సముద్రంలో చేపలు లభించే ప్రాంతం తెలుసుకుని వేటాడేందుకు అవకాశం ఉంటుంది. తుపానుల సమాచారం అధికారుల ద్వారా ముందస్తుగా తెలుసుకుని సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవచ్చు.
ఇన్బోటు మోటారు బోట్లకు సరఫరా: పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం మండలాల్లో మొత్తం 146 మోటారు బోట్లు ఉన్నాయి. వీటిలో అవుట్ బోట్ మోటార్లు-137, ఇన్బోటు మోటారు బోటులు 9 ఉన్నాయి. మొదటి విడతలో ఇన్బోటు మోటారు బోట్లకు డివైజ్లు సరఫరా చేశారు. వాటిని ఆయా బోట్లకు ఏర్పాటు చేయాల్సి ఉంది.
డివైజ్లతో బహుళ ప్రయోజనం: సముద్రంలో చేపల వేటకు వెళ్లే బోట్లకు ఏర్పాటు చేసే డివైజ్లతో బహుళ ప్రయోజనం ఉంటుందని మత్స్యశాఖ జేడీ ఆర్వీఎస్వీ ప్రసాద్ తెలిపారు. వేటకు వెళ్లిన బోట్లు ఎక్కడ ఉన్నది, అక్కడ స్థితిగతులను తెలుసుకుని అవసరమైన సమయంలో సహాయ సహకారాలు అందించేందుకు వీలుంటుందని చెప్పారు.
గుంటూరులో ఎయిర్ ట్యాక్సీలు - తక్కువ ఖర్చుతోనే ప్రయాణం
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ అప్డేట్ - సీఎంపీ కోసం కేంద్రం నిధులు