Srivari Temple in Amaravati : ఇల వైకుంఠంలా విరాజిల్లే తిరుమల క్షేత్ర వైభవాన్ని అమరావతిలోనే దర్శింపజేసేలా రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం నడుంబిగించింది. దేవాలయం చుట్టూ భారీ ప్రాకారం, ప్రధాన ముఖద్వారం వద్ద ఏడు అంతస్తులతో మహారాజ గోపురం, మూడు దిక్కుల్లో ఐదు అంతస్తులతో గోపురాలు, మాడ వీధులు, పుష్కరిణితో పాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలతో అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దనుంది.
అమరావతి నిర్మాణ పనుల్ని మొదలు పెడుతున్న సర్కార్ సమాంతరంగా శ్రీవారి ఆలయాన్ని రూ.185 కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిని సీఎం చంద్రబాబుకు ఈ నెల 14న టీటీడీ అధికారులు వివరించారు. ఆయన ఆమోదముద్ర వేయడంతో అమలుకు సిద్ధమవుతున్నారు. రాజధానిలో శ్రీవారి కల్యాణోత్సవాన్ని టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 15న కన్నుల పండుగలా నిర్వహించడం ద్వారా అమరావతి పునర్వైభవానికి ప్రభుత్వం నాంది పలికింది.
జగన్ కక్షగట్టినా భక్తులతో కళకళ : రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాలని ఏడేళ్ల ముందు అప్పటి టీడీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వెంకటపాలెం వద్ద ప్రధాన అనుసంధాన రహదారికి, కృష్ణా కరకట్టకు మధ్యలో 25 ఎకరాలను కేటాయించింది. రూ.150 కోట్ల అంచనా వ్యయంతో తిరుమలను తలపించేలా శ్రీవారి ఆలయం నిర్మించాలన్నది ఆలోచన. ఈ ప్రతిపాదనకు టీటీడీ ధర్మకర్తల మండలి 2018లో ఆమోదం తెలిపింది.
ప్రణాళికలు సిద్ధమై పనులు ప్రారంభించిన కొన్నాళ్లకే అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ రాజధానిపై కక్షగట్టి ఎక్కడి పనులు అక్కడే నిలిపేసింది. శ్రీవారి ఆలయ నిర్మాణ పనులూ నిలిచిపోయాయి. ఆ తర్వాత జగన్ సర్కార్ ఆదేశాలలో ఆలయ ప్రణాళికను టీటీడీ కుదించింది. అంచనా వ్యయాన్ని రూ.36 కోట్లకు పరిమితం చేసింది. ప్రధాన ఆలయం, లోపాలి ప్రాకారం, ఒక రాజగోపురం, ధ్వజస్తంభ మండపాలు మాత్రం నిర్మించి మమ అనిపించింది. జగన్ ప్రభుత్వం అంతలా కక్షగట్టినా అమరావతిలోని శ్రీవారి ఆలయం భక్తులతో నిత్యం కళకళలాడుతోంది.
సకల హంగులతో నిర్మాణం! : ఏడు సంవత్సరాల క్రితం శ్రీవారి ఆలయాన్ని ఏ స్థాయిలో నిర్మించాలనుకున్నారో దానికి మించి సకల హంగులూ కల్పించనున్నారు. దేవాలయానికి లోపలి ప్రాకారం మాత్రమే ఉండగా, ఇప్పుడు వెలుపలి ప్రాకారాన్నీ నిర్మించనున్నారు.
- వెలుపలి ప్రాకారానికి తూర్పు దిక్కున మహారాజగోపురం, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశల్లో రాజగోపురాలు ఉంటాయి. వాటితో పాటు కల్యాణోత్సవ, ఉత్సవ మండపాలను రూ.84 కోట్లతో నిర్మించనున్నారు.
- ఆర్జిత సేవల మండపం, వాహన మండపం, అద్దాల మండపం, రాధా మండపం, ఆంజనేయస్వామి ఆలయం, పుష్కరిణి నిర్మిస్తారు. ఆలయ ప్రాంగణంలో కట్స్టోన్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తారు. వీటన్నిటికీ కలిపి రూ.44 కోట్లు వెచ్చిస్తారు.
- రూ.6 కోట్లతో ఆలయానికి చుట్టూ మాడ వీధులు, అప్రోచ్ రహదారులు ఏర్పాటు చేస్తారు.
- అన్నదానం కాంప్లెక్స్, అర్చకులు, సిబ్బంది క్వార్టర్లు, రెస్ట్ హౌస్, భక్తులు వేచివుండే హాల్ వంటి నిర్మాణాల్ని రూ.20 కోట్లతో చేపడతారు.
- రూ.20 కోట్లతో ధ్యాన మందిరాన్ని నిర్మిస్తారు.
- విద్యుత్ సబ్స్టేషన్, సోలార్ లైటింగ్ విధానం, సోలార్ పవర్ ప్లాంట్ తదితరాలను రూ.11 కోట్లతో ఏర్పాటు చేస్తారు.
అమరావతిలో అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి కల్యాణం
రాజధాని అమరావతికి గేట్వేగా ఈ నగరం - అభివృద్ధికి ప్రభుత్వం కీలక అడుగులు