Solar Power Projects in AP: ఉచితంగా విద్యుత్ అందడమేగాక అదనపు ఆదాయం దక్కనుండటంతో సౌరవిద్యుత్ ప్రాజెక్ట్లు ఏర్పాటుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాయితీలు అదనం. ఎస్సీలు, ఎస్టీలు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండానే సౌరవిద్యుత్ ప్రాజెక్ట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన వాళ్లకూ రాయితోపోనూ మిగిలిన సొమ్ము చెల్లించేందుకు బ్యాంకులు రాయితీలు ఇవ్వనున్నాయి.
ఇంటింటా సౌర వెలుగులు: వందలు, వేలాది రూపాయలు విద్యుత్ బిల్లులు కట్టే పనిలేకపోవడమేగాక అదనంగా ఆదాయం సమకూరనుండటంతో ఇంటింటా సౌరవిద్యుత్ కాంతులు వెల్లువిరయనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు సైతం ఇస్తుండటంతో సామాన్యులు సైతం తమ ఇళ్లపై సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కావాల్సినంత విద్యుత్ వినియోగించుకుని మిగులు విద్యుత్ను గ్రిడ్కు అందించి లాభాలు పొందే అవకాశం ఉంది.
20 లక్షల ఇళ్లపై సోలార్ వెలుగులు: పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన పథకం కింద 2027 మార్చి నాటికి 20 లక్షల ఇళ్లపై 2 కిలోవాట్ల సామార్థ్యం గల ప్రాజెక్ట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీని ద్వారా సుమారు 4 వేల మెగావాట్లు విద్యుత్ అదనంగా అందుబాటులోకి రానుందని అంచనా. ఈ పథకం కింద గరిష్ఠంగా 3 కిలోవాట్ల వరకు కేంద్రం రాయితీ ఇస్తోంది. రాయితీ సొమ్ముపోనూ మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు రుణంగా అందించనున్నాయి.
2 కిలోవాట్ల ప్రాజెక్ట్ ఏర్పాటుకు లక్షా 10 వేల వరకు ఖర్చు కానుండగా దీనికి 60 వేల వరకు కేంద్రం రాయితీ ఇవ్వనుంది. మిగిలిన 50వేలు వినియోగదారులు భరించాలి. దీనిద్వారా 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్కు వెళ్తుంది. ఒక్కో యూనిట్కు 2 రూపాయల 9 పైసల చొప్పున విద్యుత్ సంస్థలు వినియోగదారులకు చెల్లిస్తాయి.
వినియోగదారుల పోర్టల్లో రిజిస్ట్రేషన్: ఇంటిపై సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలనుకున్నవాళ్లు ముందుగా వినియోగదారుల జాతీయ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కరెంట్ బిల్లు, బ్యాంకు వివరాలు, చిరునామా నమోదు చేయాలి. వెయ్యి రూపాయల ఫీజు చెల్లించి డిస్కంకు దరఖాస్తు సమర్పిస్తే సోలార్ ప్యానెళ్లు అందించే కంపెనీల పేర్లు, వివరాలు కనిపిస్తాయి. అందులో ఒకదాన్ని ఎంచుకుని ఒప్పందం చేసుకుంటే కేంద్రం ఇచ్చే రాయితీపోనూ మిగిలిన మొత్తం బ్యాంకుల నుంచి రుణంగా పొందే ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే దేశీయంగా తయారైన సోలార్ ప్యానెళ్లు వాడిన వారికే రాయితీ లభిస్తుంది.
ఇంటిపై సోలార్ ప్యానెళ్లు బిగించిన తర్వాత ఆ ఫొటోలు సైట్లో అప్లోడ్ చేయాలి. వాటిని పరిశీలించిన తర్వాత డిస్కంలు స్మార్ట్ మీటర్ బిగిస్తాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత 15 రోజుల్లోనే కేంద్రం ఇచ్చే రాయితీ సొమ్ము వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఇంటి అవసరాలకు సరిపడినంత రాకపోయినా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా అయితే విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ వినియోగించుకుంటున్నామో అలాగే వాడుకోవచ్చు. ఒకవేళ అదనంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయితే గ్రిడ్కు వెళ్లిపోతుంది. స్మార్ట్ మీటర్ ద్వారా ఎంత విద్యుత్ ఇచ్చామో లేదా గ్రిడ్ నుంచి ఎంత తీసుకున్నామో తెలుసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్లకు వేగంగా అనుమతులు ఇచ్చేలా ఏపీఈఆర్సీ నిబంధనలను సవరించింది.
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ - బీసీలకు 20 వేలు రాయితీ : రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల 18 వేల ఎస్సీ, ఎస్టీ గృహాలకు ప్రభుత్వం ప్రతినెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పుడు వారి ఇళ్లపై 2 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్లకు కేంద్రం ఇచ్చే 60వేల రాయితీ పోనూ మిగిలిన 50 వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు ముందుకొచ్చింది. అదే విధంగా బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీ పోనూ అదనంగా 20 వేలు అందించనుంది. అంటే 30 వేలు వినియోగదారులు భరించాల్సి ఉంటుంది. అది కూడా రుణంగా పొందవచ్చు.
ఇళ్లపై ఏర్పాటు చేసే 2 కిలోవాట్ల ప్రాజెక్ట్లకు 60 వేలు రాయితీ ఇస్తుండగా ఆ తర్వాత ప్రతి కిలోవాట్కు 18 వేలు రాయితీ అందనుంది. కేంద్రం గరిష్ఠంగా 3 కిలోవాట్ల వరకు రాయితీ అందించనుంది. 2026-27 లోగా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం 75 వేల కోట్ల వరకు రాయితీ భరించనుంది.
రాష్ట్రంలో భారీ సౌరవిద్యుత్ ప్రాజెక్టులు?