Engineering Colleges Try to Deemed : ఏపీలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలు డీమ్డ్ టుబీ విశ్వవిద్యాలయాల బాట పడుతున్నాయి. ఫీజుల నిర్ణయం, సీట్ల కేటాయింపులో స్వేచ్ఛ ఉండడం, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ లేకపోవడంతో మంచి కళాశాలలన్నీ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలుగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు కాలేజీలు ఉన్నత విద్యాశాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకొని, విశ్వవిద్యాలయాల నిధుల సంఘానికి (యూజీసీ) దరఖాస్తులు సమర్పించాయి.
కొన్ని కాలేజీల్లో ప్రాథమిక తనిఖీలు పూర్తయ్యాయి. మరికొన్ని కళాశాలల తనిఖీలకు యూజీసీ షెడ్యూల్ ఇచ్చింది. డీమ్డ్ వర్సిటీగా మారితే సీట్ల పెంపు, భర్తీ, కొత్త కోర్సులను ప్రవేశపెట్టుకునేందుకు ఆ విద్యాసంస్థకే అవకాశం ఉంటుంది. సీట్ల మంజూరుకు మాత్రం అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి పొందాల్సి ఉంటుంది. వర్సిటీలోని సదుపాయాల ఆధారంగా ఏఐసీటీఈ సీట్లను మంజూరు చేస్తుంది. వీటిల్లో వందశాతం యాజమాన్యం ఇష్టం ప్రకారమే భర్తీ చేసుకునే వీలుంటుంది.
డీమ్డ్ హోదాలో ప్రవేశాల నుంచి పరీక్షల నిర్వహణ, ధ్రువపత్రాల జారీ వరకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేసుకునే అవకాశం ఆయా వర్సిటీలకే ఉంటుంది. భవిష్యత్లో కళాశాలలన్నీ ధ్రువపత్రాలు జారీ చేసే సంస్థలుగా మారాలని నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యం కావడంతో డీమ్డ్ హోదా ఇచ్చేందుకు యూజీసీ సుముఖంగా ఉంది. గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికల కారణంగా డీమ్డ్ వర్సిటీల మంజూరు ప్రక్రియ కొంతకాలం ఆగింది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ నుంచి 10కి పైగా కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి వీఆర్ సిద్దార్థకు డీమ్డ్ హోదా లభించింది. మిగతావి వివిధ దశల్లో కేంద్ర ప్రభుత్వ పరిశీలనల్లో ఉన్నాయి.
ఫీజుల బకాయిలు కారణమే : ఇంజినీరింగ్ కళాశాలలు డీమ్డ్ వర్సిటీలుగా మారేందుకు ప్రయత్నించడానికి ఫీజుల బకాయిలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. గత వైఎస్సార్సీపీ సర్కార్లో మూడు త్రైమాసికాల ఫీజులను ఇంతవరకు చెల్లించలేదు. 2014-2019లో ఇంజినీరింగ్ కళాశాలల గరిష్ఠ ఫీజు ఏడాదికి రూ.70,000లకు పైగా ఉంది. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొన్ని కాలేజీల ఫీజులను తగ్గించింది. గత సంవత్సరం హైకోర్టు ఆదేశాలతో 10 శాతం ఫీజులను పెంచారని యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్ర చట్టం ద్వారా ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా ఏర్పడిన ఎస్ఆర్ఎం సైతం డీమ్డ్ టుబీ వర్సిటీగా మారేందుకు దరఖాస్తు చేసింది. ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం ప్రకారం మొత్తం సీట్లలో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం భర్తీ చేస్తుంది. వీటికి సర్కార్ నిర్ణయించిన ఫీజు రూ.77,000లు మాత్రమే ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ అర్హత ఉన్న వారికి ప్రభుత్వమే ఈ మొత్తం చెల్లిస్తుంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా 35 శాతం సీట్లు ఇవ్వాల్సి రావడంతో పాటు ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణ ఉండడంతో ఎస్ఆర్ఎం డీమ్డ్ టుబీ వర్సిటీగా మారేందుకు యూజీసీకి దరఖాస్తు చేసింది.
నామమాత్రంగా ఈఏపీసెట్ : మరోవైపు ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలు డీమ్డ్ టుబీ వర్సిటీలుగా మారిపోతున్నందున ఈఏపీసెట్కు కొంత ప్రాధాన్యం తగ్గుతోంది. ఈఏపీసెట్లో మంచి ర్యాంకు వచ్చినా ప్రముఖ కళాశాలల్లో సీట్లు లేకపోతే ఏంటి ప్రయోజనం అని విద్యావేత్తలు చెబుతున్నారు. కొన్ని కళాశాలలు బ్రౌన్ఫీల్డ్ ప్రైవేట్ వర్సిటీలుగా మారుతున్నాయి. ఇలాంటి వాటిల్లో కొత్తగా ప్రవేశపెట్టే కోర్సుల్లో కన్వీనర్ కోటాకు 35 శాతం సీట్లే ఉంటున్నాయి. క్విస్(ఒంగోలు), ఆది శంకరా(తిరుపతి), ఆర్జీఎం(నంద్యాల) మదనపల్లె ఇంజినీరింగ్(మదనపల్లె), జీఎంఆర్(శ్రీకాకుళం), గాయత్రి విద్యాపరిషత్(విశాఖపట్నం), ఎన్ఆర్ఐ(ఏలూరు), చలపతి(గుంటూరు) తదితర విద్యాసంస్థలు డీమ్డ్ టుబీ వర్సిటీకి ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రత్యేక పరీక్షలు : డీమ్డ్ యూనివర్సిటీలు సీట్ల భర్తీకి ఏ వర్సిటీకి ఆ వర్సిటీ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటిల్లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసుకుంటున్నాయి. మరికొన్ని ఇంటర్మీడియట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్, ఈఏపీసెట్లలో వచ్చిన మార్కులను పరిశీలనకు తీసుకుంటున్నాయి. విద్యా సంవత్సరాన్ని వాటికి అనుకూలంగా అమలు చేసుకుంటున్నాయి. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లు, ఇప్పటికే కళాశాలగా ఉన్న సంస్థ బ్రౌన్ఫీల్డ్ ప్రైవేట్ వర్సిటీగా మారితే అప్పటి వరకు ఉన్న సీట్లలో కన్వీనర్ కోటా కింద 70 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో కొన్ని కాలేజీలు బ్రౌన్ఫీల్డ్ ప్రైవేట్ వర్సిటీ కంటే డీమ్డ్కు ప్రాధాన్యం ఇస్తున్నాయి.