Severe Heatwave Alert in Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. ఆదివారం నంద్యాల జిల్లా అవుకులో 42.6, తిరుపతి జిల్లా వెంకటగిరిలో, చిత్తూరు జిల్లా నగరిలో, పునుగోడు ప్రకాశం జిల్లా పునుగోడులో 42.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వడగాలులు వీచాయి.
అంతే కాకుండా సోమవారం సైతం 31 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ వెల్లడించారు. రాబోయే మరో మూడు రోజులలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది. ఆదివారం వైఎస్సార్, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, పార్వతీపురం మన్యం, అన్నమయ్య జిల్లాల్లో పలు చోట్ల వానలు పడ్డాయని పేర్కొంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పిడుగులు పడి ఐదుగురు మృతి చెందారు.
పిడుగులు పడి ఐదుగురు మృతి: ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలంలో పిడుగుపాటుకు గురై క్రికెట్ ఆడుతూ ఇద్దరు యువకులు మృతి చెందారు. అదేవిధంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్ పరిధిలోని ఆలయానికి మొక్కు కోసం వెళ్లి వస్తుండగా పెద్దకడబూరు మండలం హనుమాపురానికి చెందిన ఈరన్న మృతి చెందాడు. అలాగే చిప్పగిరిలో ఉలిగమ్మ దేవాలయం వెనుక పశువుల పాక ఆవరణలో ఉన్న చెట్టుపై పిడుగు పడటంతో కొమ్మ విరిగిపడి విశ్రాంత రైల్వే ఉద్యోగి శివన్న చనిపోయారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు గ్రామానికి చెందిన యువరైతు దండు భాను ఓబులేశు పెద్దముడియం మండలం చిన్నముడియంలో ఉన్న తన పొలానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు
వేసవి కాలంలో విద్యుత్ ఆదా చేయండిలా! గృహ, వాణిజ్య సంస్థలు ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగంలో 6 శాతం ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) తెలిపింది. దీనివల్ల ఏడాదికి సుమారు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, ఫలితంగా రూ.10 వేల కోట్లు మిగిల్చినట్లు అవుతుందని వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
సాధారణంగా చాలా మంది 20 డిగ్రీల దగ్గర ఏసీలను వినియోగిస్తున్నారు. హోటళ్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, వాణిజ్య ప్రదేశాల్లో ఏసీలను వినియోగించేప్పుడు 24 డిగ్రీలు పెడితే కర్బన ఉద్ఘారాల విడుదల తగ్గుతుంది. ఏసీల జీవితకాలమూ పెరుగుతుంది. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించామని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) పేర్కొంది.
భయపెడుతున్న ఎండలు - ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే
ఎండాకాలంలో షుగర్ పేషెంట్లు ఇబ్బందులు- ఈ టిప్స్ పాటిస్తే కంట్రోల్లో ఉంటుందట!