Visakha Metro Rail Project Updates : రాష్ట్రంలో మెట్రో ప్రాజెక్టులకు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత వచ్చిన వెంటనే పనులు మొదలుపెట్టేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. తాజాగా విశాఖ మెట్రో కోసం జనరల్ కన్సల్టెన్సీని నియమిస్తూ అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ బిడ్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించి ప్రీబిడ్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
అలాగే ప్రస్తుతం ఎల్ఐసీ భవనంలో ఉన్న మెట్రో రైలు కార్యాలయాన్ని వీఎంఆర్డీఏ భవనంలోకి మారుస్తున్నారు. మరోవైపు ఏపీ సర్కార్ విశాఖ మెట్రోను త్వరిత గతిన పట్టాలెక్కించాలని చూస్తోంది. ఇందులో భాగంగా అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమిస్తోంది. భవిష్యత్ అవసరాలు, ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీ ఆధారంగా ప్రణాళిక రూపొందించి ప్రాజెక్టుకు ఒక రూపు తీసుకొస్తున్నారు.

మూడు కారిడార్లు 42 స్టేషన్లు : విశాఖ మెట్రో తొలి దశ ప్రాజెక్టును మూడు కారిడార్లలో 46.22 కిలోమీటర్ల మేర 42 స్టేషన్లతో నిర్మించాలన్నది ఆలోచన. ఇందులో భాగంగా స్టీల్ప్లాంట్-కొమ్మాది కూడలి వరకు 34.40 కిలోమీటర్లలో 29 స్టేషన్లు రానున్నాయి. గురుద్వారా నుంచి పాతపోస్టాఫీసు వరకు 5.07 కిలోమీటర్లలో 6 స్టేషన్లు, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరుకు 6.75 కిలోమీటర్లలో 7 స్టేషన్లు ఉంటాయి. మొదటి దశ ప్రాజెక్టులో 2026 నాటికి మెట్రో పట్టాలెక్కితే మూడు కారిడార్లలో ప్రయాణికుల రద్దీ రోజుకు 16,000ల వరకు ఉండొచ్చనేది అంచనా. ఆ సంవత్సరం రెవెన్యూ రూ.590 కోట్లు రావొచ్చనేది మెట్రో అధికారుల లెక్క. 2051కి ప్రయాణికుల రద్దీ 50,000లకు చేరుతుందని అంచనా వేశారు. ఆదాయం రూ.7,287 కోట్లకు పెరగొచ్చని విశ్లేషిస్తున్నారు.
ఐదు చోట్ల సమీకృత స్టేషన్లు : మెట్రోలో భాగంగా రెండు, మూడు ప్రాంతాలను కలుపుతూ సమీకృత స్టేషన్లు ఐదు చోట్ల నిర్మించనున్నారు.
- ఎన్ఏడీ కూడలి : పెందుర్తి, కంచరపాలెం వైపు వెళ్లే మార్గాలను కలుపుతూ.
- తాటిచెట్లపాలెం : విశాఖ రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్సుకు చేరుకునేలా.
- గురుద్వారా కూడలి : రెండో కారిడార్ను కలుపుతూ ఆర్టీసీ కాంప్లెక్సుకు చేరుకునేలా.
- మద్దిలపాలెం : హనుమంతువాక కారిడార్ రామాటాకీస్, ఆర్టీసీ కాంప్లెక్సుకు వెళ్లేలా.
- హనుమంతువాక కూడలి : సింహాచలం బీఆర్టీఎస్తో పాటు ఆరిలోవ, హెల్త్సిటీకి వెళ్లేలా.

విశాఖ వాసులకు గుడ్న్యూస్ - రూ.11,498 కోట్లతో 46 కి.మీ. మెట్రో