All India Civil Services 11th Ranker Sai Sivani Interview : యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్-2024 తుది ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెదే ఉత్తమ ర్యాంకు.
సివిల్స్ సాధించాలనేది చాలామంది కల. కానీ కల కంటేనే సరిపోదు. ఆ కలని సాకారం చేసుకునే దిశగా అడుగేయాలి. ఆహర్నిశలు శ్రమించాలి. అప్పుడే విజయం సాధిస్తారు. ఆ కోవకే చెందుతుంది వరంగల్కు చెందిన సాయి శివాని. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని పుస్తకాలతో కుస్తీపట్టింది. ఫలితంగా ఆలిండియా సివిల్స్లో 11 వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలిచింది. మరి, ఆమె విజయ ప్రస్థానం శివాని మాటల్లోనే విందాం.
అలా సివిల్స్పై ఆసక్తి : "మాది వరంగల్లోని ఖిలా వరంగల్. నాన్న రాజ్ కుమార్ మెడికల్ రెప్రజెంటేటివ్ పని చేస్తారు. అమ్మ రజిత. నాకో తమ్ముడు, చెల్లెలు. పది వరకూ ఖమ్మంలో చదివుకున్నాను. ఇంటర్మీడియట్, బీటెక్ ట్రిపుల్ఐటీ ఇడుపులపాయలో పూర్తి చేశాను. తొలిసారి ప్రిలిమ్స్ కూడా పాసవ్వలేకపోయాను. కొంత నిరాశపడ్డాను. కానీ, ఆ టైంలో కుటుంబ సభ్యులంతా అండగా నిలిచారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంకు వచ్చింది. వరంగల్ బిడ్డగా చిన్నప్పటి నుంచే కాకతీయుల చరిత్రపై ఆసక్తి ప్రారంభమైంది. 80 సంవత్సరాల వయసులోనూ కదనరంగంలో అడుగుపెట్టిన రాణీ రుద్రమ స్ఫూర్తితో నేనూ ప్రజల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ ఇష్టంతోనే ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చిన ఉన్నత అధికారుల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. అలా ఐఏఎస్గా, ఎన్నికల కమిషనర్గా ఎన్నో మార్పులు తీసుకొచ్చిన టీఎన్ శేషన్పై ఎంతో అభిమానం పెరిగింది. క్రమంగా నా దృష్టి సివిల్స్ ఆసక్తి కలిగింది."
ఇప్పటి వరకు సెల్ ఫోన్ వాడలేదు : "నేను సొంతంగానే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంటర్వ్యూకు మాత్రం ఆన్లైన్లో గైడెన్స్ తీసుకున్నా. నేను ఇప్పటి వరకు సెల్ ఫోన్ వాడలేదు. ట్రిపుల్ఐటీలో చదివేటప్పుడు అక్కడ కాలేజీలోని ఉన్న నంబర్తోనే ఇంట్లో వాళ్లతో మాట్లాడేదాన్ని. చదువు పూర్తి అయ్యాక నాన్న ఫోన్ నంబరుతోనే స్నేహితులతో కాంటాక్ట్లో ఉన్నా. చదివినంత సేపూ ఏకాగ్రతతో చదువుతాను. ఫోనే వాడను కనుక సామాజిక మాధ్యమాల ప్రభావం నా మీద చాలా తక్కువే. అలాగని ట్రెండింగ్ విషయాలు తెలుసుకోనని కాదు. పత్రికలు, టీవీలు ద్వారా తెలుసుకుంటాను. ఇక సంస్కృతి, కళల రాజధానిగా పేరొందిన వరంగల్ నుంచి ఇంటర్య్వూకు హాజరవ్వడం వల్లేనేమో కాకతీయుల చరిత్ర గురించే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. గొలుసుకట్టు చెరువుల నుంచి రామప్ప, వేయి స్తంభాల గుడి వరకూ చరిత్ర అంతా చెప్పా. సరైన లక్ష్యం ఉంటే ఎంత కష్టమైనా విజేతలం కాగలమనడానికి నేనే ఉదాహరణ."
సివిల్స్ విజేతల్లో ఎక్కువమంది ఆ కుటుంబాల నుంచి వచ్చిన వారే!
తండ్రులు హెడ్ కానిస్టేబుళ్లు - కుమారులు సివిల్స్ ర్యాంకర్లు
ఆత్మవిశ్వాసంతో సత్తా చాటిన గిరి పుత్రుడు - ఆరో ప్రయత్నంలో ఐఏఎస్!