Adilabad Boy Needs a Heart Transplant : అప్పటివరకూ ఆ బాలుడు అందరితో కలిసి చలాకీగా ఆడుతూపాడుతూ తిరిగేవాడు. కానీ ఇప్పుడు నడిస్తేనే ఆయాస పడుతున్నాడు. పైగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడు కీలకమైన పదో తరగతి పరీక్షలూ రాయలేకపోయాడు. ఏమైందోనని తల్లిదండ్రులు భయంతో అతడికి వైద్య పరీక్షలు చేయించగా, డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు. 'మీ అబ్బాయికి గుండె సమస్య ఉంది. గుండె మార్పిడి చేస్తే తప్ప ఎక్కువ కాలం బతకడు' అని చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రుల కళ్లు చమ్మగిల్లాయి. కాయకష్టం చేసుకుని బతికే తాము రూ.లక్షలు పోసి కుమారుడిని ఎలా బతికించుకునేదని వారు తల్లడిల్లుతున్నారు.
ఆదిలాబాద్లోని అంబేడ్కర్నగర్కు చెందిన సావంత్ రేఖ, మిళింద్ దంపతులకు కూలి పనులే జీవనాధారం. వీరి పెద్ద కుమారుడు ఆర్యన్ (15) మూడు నెలల కిందట ఛాతీనొప్పి అంటూ వాంతులు చేసుకున్నాడు. రిమ్స్ ఆసుపత్రిలో చూపిస్తే పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ వారి వద్ద డబ్బులు లేకపోవడంతో బంధువుల వద్ద అప్పు చేసి కుమారుడిని హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఆ బాలుడు బతకాలంటే కేవలం గుండె మార్పిడి ఒక్కటే పరిష్కారమని వైద్యులు నిర్ధారించారు.
చికిత్సకు రూ.10 లక్షల వరకు ఖర్చు : ఈ గుండె మార్పిడి చేసేందుకు రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో పుణెలో ప్రైవేటు ఉద్యోగిగా పని చేసే ఆర్యన్ బాబాయి ప్రసన్నజిత్ ఓ ఫౌండేషన్ సహకారంతో గుండె మార్పిడి చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్యన్ను పుణెలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అవయవదాన చట్టం ప్రకారం, గుండెమార్పిడి శస్త్రచికిత్స వంతు వచ్చేలోగా వైద్య పరీక్షలు, చికిత్సకు దాదాపు రూ.10 లక్షల వరకు అవుతాయని ఆర్యన్ తల్లి తెలిపారు. ఏ రోజు ఏ స్థితిలో తమ కుమారుడు ఉంటాడో తెలియడం లేదని, దాతలు సహకరించి ఊపిరి పోసి ఆదుకోవాలని ఆమె వేడుకున్నారు. ఆర్థిక సాయం చేయాలనుకునే దాతలు రేఖ ఫోన్ నంబరు 7993626731లో సంప్రదించి తోచిన ఆర్థిక సాయాన్ని చేయాలని కోరారు.
ఎండల్లో గుండె జబ్బుతో భద్రం - హార్ట్ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
సరికొత్త ఆవిష్కరణ - చేతిలో ఇమిడిపోయేంత పరికరంతో నిమిషాల్లో 'హార్ట్ ఎటాక్' నిర్ధారణ