Additional Charges on Gas Cylinders in Nellore District : గ్యాస్ సిలిండర్ల సరఫరా తీరుపై ఇటీవల ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. గ్యాస్ ధరలు, సరఫరా, ఏజెన్సీల పనితీరు తదితర అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. అందులో కందుకూరులో సిలిండర్పై అదనంగా వసూలు చేస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులొచ్చాయి. ఈ అదనపు వసూలు ఒక్క కందుకూరు పరిధిలోనే కాదు నెల్లూరు జిల్లా అంతటా ఉంది.
గ్యాస్ వినియోగదారులకు బండ బాదుడు తప్పడం లేదు. సిలిండర్ బుక్ చేసుకున్నాక గ్యాస్ ఏజెన్సీల సిబ్బంది సిలిండర్ను ఇంటికి తీసుకొచ్చినపుడు నిర్ణీత రుసుం కంటే అదనంగా రూ.30 నుంచి రూ.60 వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి నిర్ణీత దూరం వరకు ఉచితంగానే సరఫరా చేయాలి. వినియోగదారులు చెల్లించే బిల్లులోనే ఇందుకు సంబంధించిన ఛార్జీలు కలిపి ఉంటాయి. డెలివరీ బాయ్లు ముక్కుపిండి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు.
7,87,483 గ్యాస్ కనెక్షన్లు : జిల్లాలో మొత్తం 7,87,483 కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు వినియోగదారులంతా అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి. సిలిండర్ డెలివరీ సిబ్బంది ఇచ్చే రశీదులో సంబంధిత చార్జీలు, ఏజెంట్ కమీషన్, గ్యాస్ ధర కలిపి ఉంటాయి. గృహాలకు సంబంధించి ఒక్కో సిలిండర్కు రూ.65 చమురు సంస్థలు ఏజెన్సీలకు చెల్లిస్తాయి.
5 కి.మీ లోపు ఉచితం : సిలిండర్ సరఫరా విషయంలో పలు నిబంధనలు పెట్టారు. 5 కి.మీ లోపు ఉచితంగా, 5 కి.మీ దాటితే రూ.20, 10 కి.మీ తరువాత రూ.30, 15 కి.మీ దాటితే రూ.40 వినియోగదారుల నుంచి అదనంగా తీసుకోవచ్చు. నెల్లూరు, కందుకూరు, కావలి, ఆత్మకూరు పట్టణాల్లో 5 కి.మీ లోపు ఉన్నా సిలిండర్కు రూ.30 నుంచి రూ.60 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు తదితరచోట కమర్షియల్ సిలిండర్లు వాడాల్సి ఉన్నా.. గృహ సిలిండర్లు వినియోగిస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా అడ్డుకట్ట వేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుల సౌకర్యార్థం 1967 టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. అక్రమాలు జరిగితే ఈ నంబరుకు ఫిర్యాదు చేయొచ్చు.
బాయ్లను కట్టడి చేయకుంటే చర్యలు : ఐవీఆర్ఎస్ సర్వే విషయమై జేసీ కార్తీక్ జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో రెండు రోజుల కిందట సమావేశం నిర్వహించారు. సర్వేలో పలు ఏజెన్సీలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని.. ఏజెన్సీల నిర్వాహకులు డెలివరీ బాయ్లను కట్టడి చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిలిండర్కు రశీదుపై ఉన్న మొత్తం కంటే అధికంగా వసూలు చేస్తే సదరు ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్వో విజయ్కుమార్ తెలిపారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, వినియోగదారులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు.