Musi River Catchment Areas are Pollute : మూసీ పరివాహక ప్రాంతాల్లోని సామాన్యులు అల్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అక్కడున్న వారి ఇళ్లలో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు తరచూ పాడవుతున్నాయి. ఏసీ మరమ్మతుకు గురైతే ఒకేసారి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు అవుతోంది. అదేవిధంగా రిఫ్రిజిరేటర్ లేదా టీవీ పాడైతే కనీసం రూ.5 వేలు సమర్పించుకోవాల్సిందే. ఇలా విడిభాగాలు మారిస్తే జేబుకు చిల్లు పడుతూనే ఉంటుంది. ఫార్మా, బల్క్ డ్రగ్ పరిశ్రమలు నిత్యం వ్యర్థ జలాలను మూసీలో వదులుతుండటమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే జలాల నుంచి కుళ్లిన కోడిగుడ్డు వాసనతో వెలువడుతున్న హైడ్రోజన్ సల్ఫైడ్ ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లోని విడిభాగాలు తప్పుపట్టేలా చేస్తోంది.
ప్రభావం ఇదీ మరి : హైడ్రోజన్ సల్ఫైడ్ ఎయిర్ కండిషనర్ భాగాల్లో ముఖ్యంగా రాగి కాయిల్లు తుప్పు పట్టడానికి కారణం అవుతున్నాయి. దీంతో లీకేజీలు, బ్రేక్డౌన్ వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఏసీ పనితీరు సామర్థ్యాన్ని తగ్గించి విద్యుత్ వినియోగం, నిర్వహణ ఖర్చులను పెంచుతోంది. ఈ వాయువు గాలిలోని తేమతో చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం లేదా ఇతర సల్ఫర్ సమ్మేళనాలను ఏర్పరిచి ఏసీలను పాడు చేస్తున్నాయి. ఏసీలోని కాపర్ కాయిల్లు, ట్యూబింగ్, ఇతర భాగాల పనితీరుపై ప్రభావం చూపుతాయని పీసీబీ అధికారి డి.ప్రసాద్ తెలిపారు. అలాగే ఐఐటీ మద్రాస్లోని ఇంజినీరింగ్ విభాగం తన అధ్యయనంలోనూ ఇదే విషయాన్ని ధ్రువీకరించింది.
పుట్టగొడుగుల్లా మరమ్మతు కేంద్రాలు : బాపూఘాట్, గండిపేట, ముసారాంబాద్ బ్రిడ్జి, ప్రతాప సింగారం, పీర్జాదిగూడ వరకు మూసీ నది నీటి నాణ్యతను పీసీబీ పరీక్షిస్తోంది. గండిపేట వద్ద మినహా ఇతర ప్రాంతాల్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్, బయో లాజికల్ ఆక్సిజన్ డిమాండ్ నిర్దేశిత మోతాదులో లేకపోవడం గమనార్హం. ఫలితంగా రాజేంద్రనగర్, లంగర్హౌజ్, చాదర్ఘాట్, కార్వాన్, గోల్నాక, నయాపూల్, శంకర్నగర్, మూసానగర్, ఉప్పల్, నాగోల్, మలక్పేట్, ఇబ్రహీంబాగ్ తదితర ప్రాంతాల్లో కాలుష్య ప్రభావం చూపిస్తోంది. దీంతో ఏసీల మరమ్మతు కేంద్రాలు ఆ ప్రాంతాల్లో పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్నాయి.
మెట్రోరైళ్ల రాకపోకలపై ప్రభావం : మెట్రో రైళ్ల ప్రయాణాలపైనా ఈ కాలుష్య ప్రభావం కోరలు చాచుతోంది. ఉప్పల్ నుంచి రాకపోకలు సాగించే సమయంలో సాంకేతిక సమస్యలకు ఈ కాలుష్య కారకాలే కారణమని నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు. మురుగు బాగా పేరుకుపోయిన చోట, కలుషిత జలాలతో వాతావరణంలోకి వెలువడే హైడ్రోజన్ సల్ఫైడ్ వల్లే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పేర్కొన్నారు.
కుళాయిల గొళ్లాలు సైతం తుప్పు : మరమ్మతులు, టెక్నీషియన్ల సూచన మేరకు వేసే రంగులతో తాత్కాలిక పరిష్కారం లభిస్తుందని, ఉపరితల జలాల ప్రవాహం ఎప్పుడూ పారుతూ ఉంటే వాయువు విడుదల అవ్వదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు కారణంగా ఇంట్లోని వస్తువులు సైతం రంగు మారుతాయని నిపుణులు తెలుపుతున్నారు. వెండి సామగ్రి, కుళాయిలు, తలుపుల హ్యాండిల్స్, గొళ్లాలు పాడైపోతున్నాయని మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం :
- మూసీ నదికి ఐదు హాట్స్పాట్లు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ జిల్లాలో రెండు, రంగారెడ్డి జిల్లాలో రెండు, మేడ్చల్లో ఒకటి ఉన్నాయి.
- 194 పరిశ్రమల నుంచి 5.65 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు వస్తుండగా వాటిని శుద్ధి చేసి అక్కడే పునర్వినియోగిస్తున్నట్లు పీసీబీ తెలుపుతోంది.
- మరో 326కి పైగా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు వెళ్తున్నాయి. ఇలా శుద్ధి చేసిన నీటిని ప్రతిరోజూ 4 మిలియన్ లీటర్లను అంబర్పేట వద్ద నదిలో కలుస్తాయి.
- నిర్దేశిత ప్రమాణాల మేరకు శుద్ధి జరిగితే మూసీ మురికికూపంగా మారదని పీసీబీ లెక్క కట్టింది.
- ఇందులో అంబర్పేట తర్వాత ఉప్పల్, మల్లాపూర్, నాచారం పారిశ్రామికవాడల నుంచి వచ్చే జలాలు ఉప్పల్ నల్లచెరువు కింద కలిసే వ్యర్థాలతో మూసీ తీవ్ర కాలుష్యం బారిన పడుతోంది. దిగువన ఉన్న ఘట్కేసర్, హయత్నగర్లోని పరిశ్రమలు సైతం మూసీని కలుషితం చేసేస్తున్నాయి.
మూసీ, హైడ్రాలపై ప్రత్యేక దృష్టి - బడ్జెట్లో భాగ్యనగరానికి పెరిగిన కోటా
మూసీ అభివృద్ధి పనిలో ముందడుగు - ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4100 కోట్ల రుణానికి అనుమతి!