లంచం అడగాలంటే ఇకపై గుండెల్లో వణుకు పుట్టాల్సిందే! - అవినీతి అధికారులపై అనిశా ఉక్కుపాదం - ACB Raids In Telangana 2024
ACB Raids In Telangana : అవినీతి అధికారులపై అనిశా ఉక్కుపాదం మోపుతోంది. వరుస దాడులు, అరెస్టులతో అవినీతి అధికారుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. శుక్రవారం ఒక్క రోజులోనే నీటి పారుదల, ట్రాన్స్కో, పోలీస్, పశు సంవర్ధక శాఖ, ఇతర కేసులతో కలిపి మొత్తం 13 మందిని కటకటాల్లోకి నెట్టారు. అరెస్ట్ అయిన వారిలో దిగువ స్థాయి నుంచి ఉన్నతాధికారులూ ఉండటం గమనార్హం.

Published : June 1, 2024 at 12:33 PM IST
ACB Raids In Telangana : ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవాలంటే జంకే విధంగా ఏసీబీ దూకుడు పెంచింది. వరుస దాడులతో అవినీతి తిమింగళాలను ఏరేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 13 మందిని అరెస్ట్ చేసింది. వనపర్తిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, స్తంభాల ఏర్పాటుకు ఓ వ్యక్తి వద్ద రూ.19 వేలు లంచం తీసుకుంటున్న టీజీఎస్పీడీఎస్ఎల్కు చెందిన ముగ్గురు అధికారులను వలపన్ని పట్టుకున్నారు. సూపరింటెండెంట్ ఇన్ ఇంజినీర్ నాగేంద్ర కుమార్, డివిజనల్ ఇంజినీర్ నరేంద్ర కుమార్, అసిస్టెంట్ ఇంజినీర్ మధుకర్లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
మరో కేసులో భవన నిర్మాణానికి ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.2 లక్షల 50 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి సాగునీటి శాఖ ఈఈ బన్సీలాల్, ఏఈ నిఖేష్, కార్తిక్, సర్వేయర్ గణేష్లు అనిశాకు చిక్కారు. రూ.కోట్లు సంపాదించినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. కుషాయిగూడలో భరత్ రెడ్డి అనే వ్యక్తి భూ వివాదం కేసును మూసి వేసేందుకు పోలీసులు రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
వీళ్లు మారరు - ఏసీబీ వలకు చిక్కిన నలుగురు అవి 'నీటి' అధికారులు - ACB CAUGHT GOVT OFFICIALS RED HAND
ACB Caught Govt Officials in Bribe Case : ఇన్స్పెక్టర్ వీరస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ షఫీ, మధ్యవర్తి ఉపేందర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని, అతని ద్వారా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. వ్యవహారంలో గుర్రంగూడ సమీపంలో ఉన్న ఇన్స్పెక్టర్ వీరస్వామి నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముగ్గురిని అరెస్ట్ చేసి నాంపల్లిలోని అనిశా కార్యాలయానికి తరలించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేశారు. లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ సీఈవో రాంచందర్, అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి ఓఎస్డీ కల్యాణ్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కుంభకోణంలో ఇప్పటి వరకూ రూ.700 కోట్ల మేర అవినీతి జరిగినట్లు అనిశా గుర్తించింది. ఇలా వరుస దాడులతో ఒక్క రోజులోనే 13 మంది అవినీతి అధికారులను అనిశా అరెస్ట్ చేసి జైలుకి తరలించింది. భవిష్యత్తులో ఇదే పారదర్శకతతో ముందుకు వెళ్తామని అనిశా డీజి సివి ఆనంద్ తెలిపారు.

