Pakistani Girl Living Dharmavaram : పాకిస్థాన్లో పుట్టిన ఓ మహిళ ఇక్కడకు వచ్చి ఓ భారతీయుడిని వివాహం చేసుకుంది. అనుకోని పరిస్థితుల్లో వారి కుమార్తె దాయాది దేశంలో జన్మించింది. ఏడు సంవత్సరాల వయసులో ఇక్కడకు వచ్చేసిన ఆ అమ్మాయికి ప్రస్తుతం 26 ఏళ్లు. అయినా ఇప్పటికీ పాకిస్థాన్ పౌరురాలిగానే రికార్డుల్లో కొనసాగుతుండటం గమనార్హం. రెండు సంవత్సరాల కిందట భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆమోదం పొందలేదు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రంశా రఫిక్ కథ ఇది. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పౌరులను తిరిగి పంపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె వివరాలు బయటకొచ్చాయి.
మలుపు తిప్పిన కార్గిల్ యుద్ధం : కర్ణాటకలోని బళ్లారికి చెందిన మహబూబ్ పీరన్ అనే వ్యక్తి దేశ విభజన సమయంలో పాకిస్థాన్ వెళ్లిపోయారు. అక్కడే ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. చిన్న కుమార్తె జీనత్ పీరన్ను ధర్మవరంలోని తన చెల్లెలు కుమారుడు రఫిక్ అహ్మద్కు ఇచ్చి 1989లో పెళ్లి చేశారు. ఈ జంటకు మొదట కుమారుడు పుట్టారు. 1998లో జీనత్ రెండోసారి గర్భం దాల్చింది. ఆ సమయంలో పాకిస్థాన్లోని తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని సమాచారం వచ్చింది.
దీంతో జీనత్ పీరన్ తండ్రిని చూసేందుకు ఆమె పాక్ వెళ్లారు. అదే సమయంలో కార్గిల్ యుద్ధం మొదలుకావడంతో తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. గర్భవతిగా ఉన్న ఆమె పాకిస్థాన్లోనే రంశా రఫిక్కు జన్మనిచ్చారు. 2005లో జీనత్ పీరన్ రంశా రఫిక్ని తీసుకుని ధర్మవరం వచ్చేశారు.
పౌరసత్వానికి ఎదురుచూపులు : పాకిస్థాన్లో రంశా రఫిక్ పుట్టడంతో ఆ దేశ పౌరసత్వం వచ్చింది. ఆ తర్వాత ఆ యువతి ధర్మవరం వచ్చి విద్యాభాస్యం కొనసాగించింది. కానీ భారత పౌరసత్వం కోసం ప్రయత్నించలేదు. 2018లో పాక్ పౌరసత్వాన్ని రెన్యూవల్ చేసుకున్నారు. 2028 వరకు అది మనుగడలో ఉంటుంది. 2023లో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ అధికారులు ఆమోదం తెలపలేదు.
మదనపల్లెలో ఐదుగురు పాకిస్థాన్ పౌరులు - 20 ఏళ్లుగా ఉంటున్నట్లు గుర్తింపు
'ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు'- ప్రధాని మోదీ వార్నింగ్