Balabhadhrapuram Cancer Cases : క్యాన్సర్ కోరల్లో చిక్కుకున్న బలభద్రపురంలో వ్యాధి లెక్కలు తేలుతున్నాయి. అసలు ఎంతమంది ఈ వ్యాధి బారినపడ్డారు? ఎంతమంది మృతి చెందారనే? అంశంపై అధ్యయనం చేసిన నివేదిక వచ్చింది. మృతుల్లో మహిళలే ఎక్కువ శాతం ఉండటం ఆందోళన కలిగిస్తుంటే, పురుషుల్లో ఊపిరితిత్తులు, లివర్ సమస్యలతో మరణించినవారు అధికంగా ఉన్నారు. నోటితో ఆహారం తీసుకునేందుకు కొందరు ఇబ్బంది పడుతున్నారనే అంశం నివేదికలో తేటతెల్లమైంది.
తూర్పుగోదావరిజిల్లా బలభద్రపురంలో కాకినాడ రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ పి.సుజాత నేతృత్వంలో జరిపిన సర్వే వివరాలు వెల్లడయ్యాయి. బలభద్రపురంలో మొత్తం 62 క్యాన్సర్ కేసులున్నట్లు అధ్యయనంలో తేలింది. అందులో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు కలిపి మొత్తం 25 మంది మరణించారని నిర్ధారించింది. మిగతా 37 మందిలో 16 మంది చికిత్స పొందారని మరో 21 మంది చికిత్స పొందుతున్నారని గుర్తించింది.
Cancer Survey in Balabhadrapuram : బాధితులు, మృతుల్లోనూ మహిళలే అధిక సంఖ్యలో ఉన్నట్లు వెల్లడించింది. క్యాన్సర్ సంబంధిత అనుమానిత లక్షణాలు 41 మందిలో బయటపడ్డాయని అధ్యయనంలో తేలింది. క్యాన్సర్ బారినపడిన వారిలో మహిళల వయసు సగటున 60 ఏళ్లలోపు ఉండగా పురుషుల వయసు 60 సంవత్సరాల కంటే అధికంగా ఉంది. బలభద్రపురంలో 9940 మంది జనాభా ఉన్నారు. క్యాన్సర్ ప్రభావిత ప్రాంతాల ఆధారంగా ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునేందుకు గ్రామంలోని 40 ప్రాంతాల్లో ర్యాండమ్గా 399 కుటుంబాలకు చెందిన 1295 మంది నుంచి వివరాలు సేకరించారు.
నమోదైన క్యాన్సర్ బాధిత మహిళల్లో 80.60 శాతం మంది గృహిణులే. మిగిలినవారిలో వ్యవసాయ కార్మికులు, దుకాణాల్లో పనిచేసేవారు, టైలర్లు, వ్యాపారులు ఉన్నారు. పురుషుల్లో 50 శాతం వ్యవసాయ కార్మికులు, లారీ డ్రైవర్లు 33.30 శాతం, రోజుకూలీలు 16.70 శాతం ఉన్నారు. మహిళల్లో అత్యధికంగా బోన్, సర్వైకల్ క్యాన్సర్తోనే చనిపోయారు. పురుషుల్లో ఊపిరితిత్తులు, లివర్ సమస్యలతో మరణించినవారు అధికంగా ఉన్నారు.
క్యాన్సర్తో బాధపడే పురుషుల్లో 66.6 శాతం మంది పొగ తాగుతున్నారు. మరో 33.3 శాతం మంది పొగాకు వాడుతున్నారు. బలభద్రపురంలో వైద్యబృందం వివరాలు సేకరించిన 1295 మందిలో 949 అంటే 73.3 శాతం మందికి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు. మిగిలిన 346 మందిలో 72 మంది బీపీ, మధుమేహం, 76 మంది బీపీతో, మరో 76 మంది మధుమేహ బాధితులున్నారు. వీరిలో 41 అంటే 3 శాతం మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నాయి. రొమ్ముల్లో కణితులు, నోటి నుంచి ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం వంటి సమస్యలు ఉన్నాయని కొందరు ప్రస్తావించారు.
ఆ ఊరిని కదిలిస్తే కన్నీరే - క్యాన్సర్ కోరల్లో 'బలి'భద్రపురం
విజృంభిస్తున్న 'క్యాన్సర్ మహమ్మారి' - స్వీయ జాగ్రత్తలతోనే అడ్డుకట్ట