RCB vs RR IPL 2025 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో నెగ్గింది. రాజస్థాన్ నిర్దేశించిన 174 పరుగులు లక్ష్యాన్ని ఆర్సీబీ 17.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది. ఫిల్ సాల్ట్ (65), విరాట్ కోహ్లీ (62*) హాఫ్ సెంచరీలతో అదకగొట్టారు. పడిక్కల్ (40*) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో కుమార్ కార్తికేయకు 1 వికెట్ దక్కింది.
ఛేజింగ్లో ఆర్సీబీకి మంచి ఆరంభం లభించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండరీలతో రెచ్చిపోయాడు. దీంతో ఆర్సీబీ పవర్ ప్లే ముగిసేసరికి 65-0తో నిలిచింది. ఈ క్రమంలోనే సాల్ట్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే 8.4 ఓవర్ వద్ద సాల్ట్ భారీ షాట్కు ప్రయత్నించి క్యాచౌట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్తో కలిసి విరాట్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక రాజస్థాన్కు మరో ఛాన్స్ ఇవ్వకుండా ఈ ఇద్దరే మ్యాచ్ను ముగించేశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్కు కూడా ఇన్నింగ్స్ను అద్భుతంగానే ప్రారంభించింది. కెప్టెన్ శాంసన్ (15) ఔటైనప్పటికీ రియాన్ పరాగ్ (30)తో కలిసి యశస్వీ జైస్వాల్ (75) సూపర్ హాఫ్ సెంచరీతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో 13 ఓవర్లకే రాజస్థాన్ స్కోర్ 100 దాటింది. కానీ ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు పుంజుకున్నారు. వరుస వికెట్లు తీస్తూ, కట్టుదిట్టమైన బంతులేస్తూ పరుగులు నియంత్రించారు.
పరాగ్ను యశ్ దయాల్ ఔట్ చేయగా, జైస్వాన్ను హేజిల్వుడ్ పెవిలియన్ చేర్చాడు. హెట్మయర్ (9) కూడా విఫలమయ్యాడు. అతడిని భువనేశ్వర్ బోల్తా కొట్టించాడు. చివర్లో ధ్రువ్ జురెల్ (35*) పోరాడడం వల్ల ఆ మాత్రం స్కోరైన వచ్చింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, యశ్ దయాల్, హేజిల్వుడ్, కృనాల్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.