Rohit Sharma Retirement : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక సంచలన కారణాలున్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎంఎస్ ధోనీ తరహాలో తన వీడ్కోలును ప్లాన్ చేసుకునేందుకు రోహిత్ చేసిన ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రోహిత్ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే?
2014లో ఆసీస్ పర్యటనలో ఉన్నప్పుడు ఎంఎస్ ధోనీ సిరీస్ మధ్యలోనే టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అదే తరహాలో, త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటనలో కొన్ని టెస్టు మ్యాచ్లకు నాయకత్వం వహించి, ఆ తర్వాత సిరీస్ మధ్యలో టెస్టుల నుంచి వైదొలగాలని రోహిత్ భావించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రోహిత్ బీసీసీఐ సెలక్టర్ల ముందు ఒక ప్రతిపాదన ఉంచినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, హిట్మ్యాన్ చేసిన ఈ ప్రతిపాదనకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయలేదని తెలిపాయి.
రోహిత్ ప్రపోజల్కు బీసీసీఐ నో!
కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్లో జట్టు నాయకత్వంలో స్థిరత్వం ఉండాలని, సిరీస్ మధ్యలో కెప్టెన్ మారడం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని సెలక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రోహిత్ ప్రపోజల్ను సున్నితంగా తిరస్కరించారని, ఒకవేళ సిరీస్కు అందుబాటులో ఉండాలనుకుంటే ఆటగాడిగా కొనసాగవచ్చునని చెప్పారట. అలాగే కెప్టెన్గా మాత్రం పూర్తి సిరీస్కు ఒక్కరే ఉండాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు సమాచారం. దీంతో ఇంగ్లాండ్తో సిరీస్కు ముందే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

రోజుల వ్యవధిలో ఇద్దరు దిగ్గజాలు రిటైర్మెంట్
మరోవైపు, రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజులకే విరాట్ కోహ్లీ కూడా ఆ ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు. దీంతో భారత జట్టులో తీవ్ర నాయకత్వ లేమి ఏర్పడింది. ఈ క్రమంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తదుపరి టెస్టు కెప్టెన్ ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. హిట్ మ్యాన్ స్థానంలో తదుపరి టెస్ట్ కెప్టెన్ను ఎంపిక చేసే క్రమంలో ఇప్పటికే గిల్, రిషబ్ పంత్ ఇద్దరితోనూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ అనధికారిక చర్చలు నిర్వహించినట్లు సమాచారం. బుమ్రా, గిల్ కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నారని కథనాలు వస్తున్నాయి. గిల్కు కెప్టెన్సీ ఇవ్వడం గురించి బీసీసీఐలోని ఒక సెలక్టర్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైస్ కెప్టెన్గా అయితే బాగా సరిపోతాడని ఆ సెలెక్టర్ అన్నట్లు టాక్.
కెప్టెన్సీపై గావస్కర్ వ్యాఖ్యలు
అయితే భారత్ తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరనేదానిపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ పర్యటనలో భారత జట్టుకు గిల్ నాయకత్వం వహించగలడని అభిప్రాయపడ్డాడు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా ఉండే అవకాశం ఉందన్నాడు. 'భవిష్యత్ కెప్టెన్లు మన సూపర్ కెప్టెన్ల (ధోని, రోహిత్, కోహ్లీ) స్థాయికి చేరుకోవడానికి రెండేళ్లు పట్టొచ్చు. వారందరూ కెప్టెన్సీకి భిన్నమైన విధానాన్ని తీసుకున్నారు'
'భారత కెప్టెన్సీకి ప్రధాన పోటీదారులుగా గిల్, పంత్, శ్రేయస్ అయ్యర్ను చూసినప్పుడు ధోనీ, రోహిత్, విరాట్ వంటి ఆటగాళ్లను కలిసి చూసినట్లు అనిపిస్తుంది. గిల్ బహుశా ఎక్కువ పోటీతత్వం ఎదుర్కొంటాడు. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు వెంటనే అంపైర్ను అడుగుతాడు. రిషబ్ పంత్ స్టంప్స్ వెనుక నుంచి మ్యాచ్లో చాలా ఉత్సాహంగా ఉంటున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు' అని సన్నీ వ్యాఖ్యానించాడు.
రోహిత్, విరాట్కు BCCI గుడ్న్యూస్- స్టార్ ప్లేయర్లకు ఆ గౌరవం!